మారేడ్పల్లి, ఫిబ్రవరి19: రైలు ఎక్కే క్రమంలో…దిగే క్రమంలో ప్రయాణికులు కంగారుగా రైల్లో ఏదో ఒక వస్తువులు మరిచిపోతుంటారు. ఇంటికి వెళ్లిన తరువాత, రైల్వేస్టేషన్ నుంచి వెళ్లిపోయిన అనంతరం చూసుకుంటే బ్యాగ్ కనిపించడం లేదని…అందులో బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు ఉన్నాయని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. రైల్వే పోలీసులు ప్రయాణికుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకొని దర్యాప్తును ప్రారంభిస్తున్నారు. ఇటీవల కాలంలో ముగ్గురు ప్రయాణికులు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులతో పాటు ఒక ట్యాబ్ను మరిచిపోయారు. ఇవి దొరికిన తోటి ప్రయాణికులు నిజాయితీగా రైల్వే పోలీసులకు అప్పగించారు. వెంటనే రైల్వే పోలీసులు బాధితులకు సమాచారం అందించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ…వారికి భరోసాను ఇస్తున్నారు. దీంతో బాధితులు రైల్వే పోలీ సులకు, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
లొకేషన్ను గుర్తించి..
బ్యాగ్ను అప్పగించిన రైల్వే పోలీసులు
మియాపూర్కు చెందిన శిరీషా ఈనెల 9వ తేదీన కాకినాడకు గౌతమి ఎక్స్ప్రెస్లో వెళ్లింది. అయితే తన హ్యాండ్ బ్యాగ్ బెల్ట్ తెగిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1వ నంబర్ ఫ్లాట్ఫారం చివరల్లో పడి పోయింది. అందులో 10 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ ఉంది. రైల్వే స్టేషన్ దాటి ఆమె వెళ్లిపోయింది. వెంటనే బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు సెల్ఫోన్ టవర్ లోకేషన్ ద్వారా బ్యాగ్ను గుర్తించారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, రూ.750 నగదును రైల్వే పోలీసులు అప్పగించారు.
అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పునూరుకు చెందిన కె. వెంకటసుబ్బారావు ఈనెల 13వ తేదీన నర్సాపూర్ ఎక్ప్ప్రెస్లో సికింద్రాబాద్కు చేరుకున్నాడు. రైలు దిగుతున్న క్రమంలో 9 తులాల బంగారు ఆభరణాల బ్యాగ్ను మరిచిపోయాడు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా…ఇన్స్పెక్టర్ శ్రీను ఆదేశాలతో జీఆర్పీ పోలీసులు దర్యాప్తును చేపట్టారు. వీరితో ప్రయాణించిన తోటి ప్రయాణికురాలి బ్యాగ్లో బాధితుడి బంగారు ఆభరణాల బ్యాగ్, సెల్ఫోన్ ఉండడంతో… సదరు మహిళ సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి బాధితులకు సమాచారం అందించింది.
బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని తిరిగి వెంకటసుబ్బారావుకు 9 తులాల బంగారు ఆభరణాల బ్యాగ్ను అప్పగించారు. దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పదవ నంబర్ ప్లాట్ ఫారంలో సికిందర్ రామ్ స్టాల్స్ను నడుపుతున్నారు. తన స్టాల్స్లో యోగరాజ్ చౌదరి అనే ప్రయాణికుడు లెనోవో ట్యాబ్ను మరిచిపోయి రైలు ఎక్కాడు. దీంతో సదరు స్టాల్స్ నిర్వాహకుడు వెంటనే రైల్వే పోలీసులకు లెనోవా ట్యాబ్ను అప్పగించారు. అనంతరం రైల్వే పోలీసులు బాధితుడికి సమాచారం అందజేసి లెనోవా ట్యాబ్ను అందజేశారు.