తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 13: సాహితీవేత్తలు ప్రాచీన వాంగ్మయాన్ని, సాహిత్యాన్ని నేటి తరానికి అందించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తమ గురువు హనుమజ్జానకీరామశర్మ స్ఫూర్తితోనే ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. అవార్డులు అందజేయడం ద్వారా మరెంతో మందికి ప్రేరణ కలుగుతుందని, భాషాభివృద్ధి దిశగా యువత ముందుకు రావడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో మహా పండితుడు పోలూరి హనుమజ్జానకీరామశర్మ పేరుతో నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని పండితుడు డాక్టర్ కోవెల సుప్రసన్నాచార్యకు బుధవారం ప్రదానంచేశారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన పరిషత్తు ప్రాంగణంలోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో నిర్వహించిన ఈ కార్కక్రమంలో పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సుప్రసన్నాచార్యను సత్కరించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య రచించిన డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గ్రంథాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నెల్లూరులోని వీఆర్ కళాశాలలో డిగ్రీలో తెలుగు పాఠాలు బోధించిన హనుమజ్జానకీరామశర్మ పేరిట పరిషత్తులో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని సుప్రసన్నాచార్యకు ప్రదానంచేయడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పద్యంపై గాఢమైన అనురక్తి ఉన్నా ఆధునిక కవిత్వ చేతనను ఆవిష్కరించేందుకు సుప్రసన్నాచార్య కృషి చేశారని చెప్పారు. ఆధునిక సాహిత్య విమర్శలో నవ్యసంప్రదాయ వాదాన్ని ఆవిష్కరించారని అన్నారు. ప్రజల భాషలో పాలన, బోధన, న్యాయవ్యవహారాలు సాగాలని ఆకాంక్షించారు. మాతృభాషాభిమానాన్ని సగర్వంగా అలవరచుకోవాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. సాహిత్యంలో నిక్కచ్చిగా వ్యవహరించే గొప్ప వ్యక్తిత్వం కోవెల సుప్రసన్నాచార్య సొంతమని పేర్కొన్నారు. సాహిత్య ప్రక్రియలో అందెవేసిన చెయ్యి చెప్పారు. సనాతన సంప్రదాయానికి అధునాతన స్థితికి వారధి అని తెలిపారు. అంతకుముందు పోలూరి హనుమజ్జానకీరామశర్మ జీవితం సాహిత్యంపై, తెలంగాణ సారస్వత పరిషత్తు చరిత్రపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. కార్యక్రమంలో పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.