గ్రేటర్లో ఎక్కడ చూసినా డెలివరీ బాయ్స్ సందడి కనిపిస్తుంది. స్నాక్ స్టాల్ నుంచి బిర్యానీ సెంటర్ల వరకు వారిదే హవా. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా వారితోనే కళకళలాడుతున్నాయి. కారణం ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ రెట్టింపు కావడమే. ఔను… కరోనా, ఒమిక్రాన్ వెంటాడుతున్న తరుణంలో నగరవాసులు బయట తినడానికి ఆసక్తి చూపడం లేదు. అలా అని తమకు నచ్చిన వంటకాలను తినకుండా ఉండటం లేదు. వారంతా ఆన్లైన్లో ఆర్డర్స్ చేసి ఇంటికి ఆహారం తెప్పించుకుని ఆరగిస్తున్నారు. లంచ్, డిన్నర్లే కాదు.. స్నాక్స్, స్వీట్స్, ఐస్క్రీం, బర్గర్స్, వెజిటేబుల్స్ ఇలా అన్నీ ఆర్డర్స్ పెడుతున్నారు. దీంతో డెలివరీ బాయ్స్కు చేతినిండా పని దొరికింది. ఒక డెలివరీ బాయ్ రోజుకు రూ.700 సంపాదిస్తే.. ఇప్పుడు రూ. 1600 వరకు పొందుతున్నాడు. దీంతో చాలా మంది డెలివరీ బాయ్స్గా చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
గ్రేటర్లో సుమారు 50 వేల మంది ఫుడ్ డెలివరీ రంగంలో ఉన్నారు. ఆన్లైన్ ఫుడ్ సప్లయ్కి డిమాండ్ పెరగడంతో వీరి సేవలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్పాండా తదితర ఆహార సరఫరా సంస్థలు ఆన్లైన్లో తమ మార్కెట్ను విస్తరించుకోవడంలో భాగంగా డెలివరీ బాయ్స్ రిక్రూట్మెంట్ ఊపందుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ ఆర్డర్స్ పెరగడంతో ఈ రంగంలోకి అధిక మంది జాయిన్ అవుతున్నారని స్విగ్గీ సంస్థ మేనేజర్ తెలిపారు.
బైక్, లైసెన్స్ ఉంటే చాలు..
చదువుతో పనిలేదు. ఇంటర్వ్యూ అవసరం లేదు. ఉద్యోగం చేయాలనే తపన, కాలం విలువ తెలిస్తే చాలు ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేయొచ్చు. విధుల్లో చేరడానికి లైసెన్స్, ద్విచక్రవాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఆధార్కార్డు, పాన్కార్డు, బ్యాంక్ వివరాలు ఒరిజినల్స్తో కంపెనీలో సంపద్రిస్తే సరిపోతుంది. కస్టమర్కు ఆర్డర్ సమయానికి ఎలా అందించాలి? వారితో ఎలా నడుచుకోవాలి? ఇన్సెంటివ్స్ కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? నగరంలో డ్రైవింగ్ ఎలా చేయాలి? తదితర వాటిపై సదరు కంపెనీలు శిక్షణ ఇస్తాయి. అనంతరం వారికి లాగిన్ ఐడీ క్రియేట్ చేసి విధుల్లోకి తీసుకుంటారు.
సంస్థను బట్టి చెల్లింపులు
ఒక ఆర్డర్ మీద రూ. 40 వస్తాయని డెలివరీ బాయ్స్ అంటున్నారు. అందులో కిలోమీటర్కు రూ.5పైనే ఉంటుందని చెబుతున్నారు. కస్టమర్ డెలివరీకి రూ. 20, రెస్టారెంట్లో వెయిటింగ్కు రూ. 20.. ఇలాంటి ఫెసిలిటీలు అదనంగా ఉంటాయి. రోజుకు కనీసం 20కి పైనే ఆర్డర్స్ చేసుకుంటారు. కంపెనీ టార్గెట్ పూర్తి చేస్తే వాటి మీద అదనంగా రూ. 400పైనే ఇన్సెంటివ్స్ ఉంటాయని కంపెనీలు చెబుతున్నాయి. ఒకవేళ 20 ఆర్డర్లు చేసుకుంటే రూ. 450, 25కిపైగా ఆర్డర్లు చేస్తే రూ. 700.. ఇలా ఇన్సెంటివ్స్ వస్తాయని అంటున్నారు. మరో ఆన్లైన్ ఫుడ్ సైప్లె సంస్థ స్విగ్గీలో ఒక ఆర్డర్పై రూ.35 వరకు వస్తుందని చెబుతున్నారు. అలాగే మరో ఫుడ్ సంస్థ ఉబర్ ఈట్స్ ఒక్క ఆర్డర్ మీద డెలివరీ బాయ్స్కి రూ 35 చెల్లిస్తోంది. ఇందులో 24 ఆర్డర్లు చేసుకుంటే అదనంగా 600 రూపాయలు గడించొచ్చని డెలివరీబాయ్స్ తెలిపారు. నెలకు సుమారు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు సంపాదించుకోవచ్చని డెలివరీ బాయ్స్ తెలిపారు.
ఆర్డర్స్ అదుర్స్…
బంజారాహిల్స్, హైటెక్సిటీ, కూకట్పల్లి, మణికొండ పరిధి ప్రాంతాల్లో ఆన్లైన్ ఫుడ్ సప్లయ్కి గిరాకీ పెరిగింది. ఈ ప్రాంతాల్లో పనిచేసే డెలివరీ బాయ్ రోజుకు రూ. 2000 వరకు సంపాదించే అవకాశం ఉందని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 12గంటల వరకు సమయాల్లో ఆర్డర్స్ అధిక సంఖ్యలో ఉంటున్నాయి. ఇలాంటి పీక్స్ సమయాల్లో డెలివరీ బాయ్స్ డ్యూటీలో ఉండి.. ఆర్డర్స్కు అందుబాటులో ఉంటే ప్రతి కంపెనీ ఇన్సెంటివ్స్ పేరు మీద అదనంగా డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తోంది.
మనకు మనమే బాస్
ఎవరికింద పనిచేయాల్సినవసరం లేదు. మనకు మనమే బాస్. కొన్ని ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతాయి. ఎన్ని ఆర్డర్స్ పూర్తి చేసుకుంటే అంత కమీషన్ దొరుకుతుంది. నేను పార్ట్టైం చేసుకుంటూ పోటీపరీక్షలకు సన్నద్ధమవుతన్నాను. రూమ్రెంట్, ఖర్చులకు సరిపోతున్నాయి. కరోనా కారణంగా చాలా ఆర్డర్స్ పెరిగాయి. చాలా మంది తమకు నచ్చినవి ఆర్డర్ పెడుతున్నారు. బయటకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. టేక్ అవేనే ఎక్కువగా నడుస్తుంది.
మంచి డిమాండ్ ఉంది
కరోనా విస్తరిస్తుండటం కారణంగా ఫుడ్ ఆర్డర్స్ పెరిగాయి. ఆర్డర్స్ పెరగడంతో కమీషన్ ఎక్కువగా వస్తుంది. గతంలో రోజుకు రూ. 700 సంపాదన ఉంటే ఇప్పుడు రూ. 1500పైనే ఉంటుంది. ఆర్డర్ వస్తే కస్టమర్కు ఎంత తొందరగా ఫుడ్ చేరవేసి మరో ఆర్డర్కి వేచి ఉంటాం. కాలంతో పాటు పరుగెత్తే ఉద్యోగం ఇది. ఎన్ని ఆర్డర్స్ పూర్తి చేస్తామో అంత ఆదాయం ఉంటుంది. ప్రస్తుతం ఈ డెలివరీ రంగానికి మంచి డిమాండ్ ఉంది.