హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం కొనసాగుతున్నదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నా రు. సోమవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ‘విద్య, వైద్యరంగాల అభివృద్ధి’ అంశంపై ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏడున్నరేండ్లలో తెలంగాణలో విద్య, వైద్య రంగాల్లో పెనుమార్పులు వచ్చాయని తెలిపారు. గతంలో ఏరియా, జిల్లా, టీచింగ్ దవాఖానల ద్వారా మూడంచెల్లో వైద్యం అందగా, సర్కారు దానిని ఐదంచెలకు విస్తరించిందని లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. సర్కారు చొరవతో ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని చెప్పారు. విద్య, వైద్యరంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఒకప్పుడు వైద్యం కోసం ప్రజలు ఆస్తులమ్ముకున్నారని, ఇప్పుడు ఆ అవసరంలేకుండా పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. విద్య వైద్యరంగాల అభివృద్ధి తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడారు. వచ్చే సంవత్సరం టీఆర్ఎస్ ప్లీనరీని రెండురోజులపాటు నిర్వహించనన్నట్టు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు.