హైదరాబాద్, జనవరి 26 : తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా పంటలను పండిస్తూ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా అవతరించిందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పేర్కొన్నారు. రాష్ర్టానికి ఈ ఘనత సాధించిపెట్టి కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతులకు అభినందనలు తెలిపారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో గణనీయ పురోగతి సాధించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలని, తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని చూడాలని కోరుకొంటున్నట్టు తెలిపారు. మారుమూల ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించామని చెప్పారు. ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లోని ఆదిమ గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతోపాటు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఫార్మసీ ఆఫ్ వరల్డ్గా భారత్
స్వదేశీ కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, ఉచిత పంపిణీ మన స్వావలంబన స్ఫూర్తికి నిజమైన నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. దేశం రికార్డు స్థాయిలో 160 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించిందని, కొద్ది నెలల్లో 200 కోట్ల మారును అధిగమించనున్న భారత్ను ఇప్పుడు అందరూ ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ అని పిలుస్తున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం ఎన్నో పరీక్షలకు ఎదురొడ్డి నిలిచిందని, ప్రపంచంలోని అతిపెద్ద శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను విజయవంతంగా నడిపిస్తున్నదని గవర్నర్ కొనియాడారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, ప్రొటోకాల్ విభాగం సెక్రటరీ అర్విందర్సింగ్ పాల్గొన్నారు.