మియాపూర్, అక్టోబర్ 22: యాదాద్రి పునర్నిర్మాణం దేశ చరిత్రలోనే మరుపురాని ఘట్టమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. రాజుల కాలం, బ్రిటిష్ పాలన అనంతరం తిరిగి దేవాలయాలను నిర్మించి ప్రజలకు అందిస్తున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణలోని ప్రతి గ్రామానిదని, ప్రజలందరూ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయాన్ని త్వరలో పునఃప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
యావత్ తెలంగాణకు పెద్దాయన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామే. అలాంటి ప్రఖ్యాత దేవాలయాన్ని సీఎం కేసీఆర్ పునర్నిర్మించడం, త్వరలోనే పునఃప్రారంభించబోతుండటం గొప్ప శుభసూచకం. దేశ చరిత్రలో ఈ విషయం ఎప్పటికీ నిలిచిపోతుంది. యాదాద్రి దేవాలయం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానిది.
మన రాష్ట్రం.. మన యాదాద్రి దేవుడు.. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి యాదాద్రి లక్ష్మీనారసింహుడి ఆశీస్సులు కావాలి. రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఈ మహా పుణ్యకార్యంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. తమ శక్తి మేర ఆలయ అభివృద్ధికి విరాళాల రూపంలో తోడ్పాటును అందించాలి. తద్వారా భక్తుల మద్దతుతో యాదాద్రి ఆలయం భవిష్యత్తులో మరింత బంగారుమయమై వెలుగొందుతుంది. ప్రతి గ్రామం నుంచి భక్తులు తరలిరావాలి.
ఓటుబ్యాంకు రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో రాష్ట్ర పురోగాభివృద్ధికి కేసీఆర్ బాగా కృషి చేస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పడితే ఏదో జరుగుతుందని లేనిపోని భయాందోళనలను కొందరు కల్పించారు. కానీ, అది నిజం కాదని ఆయన నిరూపిస్తున్నారు. జనరంజకమైన పాలన, సనాతన ధర్మ వృద్ధి కోసం ఆయన ధైర్యంగా ముందడుగేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు బంగారుమయమైన యాదాద్రి ఆలయాన్ని అందించాలన్న సంకల్పాన్ని బంగారు తాపడంతో మొదలుపెట్టడమే లక్ష్యంపై కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. హిందూ ధర్మ వృద్ధి కోసం జరుగుతున్న ఈ మహాయాగంలో దాతలు విరివిగా ముందుకురావాలి.
తెలంగాణ ప్రజలందరి దేవుడిగా యాదాద్రి లక్ష్మీనారసింహుడు ఇంటి దేవుడవుతాడు. సీఎం కేసీఆర్ కృషి, ఆయన పిలుపుతో, ప్రజల భాగస్వామ్యంతో యాదాద్రి ఆలయం భవిష్యత్తులో మరింత శోభాయమానంగా వెలుగొంది భక్తుల పూజలు అందుకుంటుంది. ఇంతటి పుణ్యకార్యం చేపట్టిన ముఖ్యమంత్రి.. వేదాధ్యయనాన్ని సైతం పెంపొందించేలా, వేదఘోష వినపడేలా చర్యలు చేపట్టాలని మా సూచన.