ఓవైపు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలన సంస్కరణలు, సాంకేతిక మార్పులు తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు లక్ష్యానికి గండి కొడుతున్న అధికారులపై కన్నెర్రజేస్తున్నది. అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలితే వెంటనే వేటు వేస్తున్నది. ఇటీవల వరంగల్ రిజిస్ర్టేషన్ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడిన నలుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న ఇలాంటి వారి విషయంలో కఠినంగా ఉండడంతో మిగిలిన అధికారులూ అప్రమత్తమైనట్లు తెలుస్తున్నది.
వరంగల్, నవంబరు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ మహానగరంలో పెరుగుతున్న భూముల విలువలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసు కుంటుండడంతో ఈ రంగం దినదినాభివృద్ధి చెందు తున్నది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు నీళ్లొదిలి కొనుగోలుదారులకు భవిష్యత్తులోనూ ఇబ్బందులు కలిగేలా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను నేరుగా నివాస స్థలాలుగా అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి రిజిష్ర్టేషన్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు సహకరించినట్లు తెలియగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
వరంగల్ రిజిష్ర్టేషన్ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడిన నలుగురు సబ్ రిజిస్ట్రార్లను ఇటీవలే సస్పెండ్ చేసింది. రిజిష్ర్టేషన్ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, నాన్ లే అవుట్ల అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలపై ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులోని సబ్ రిజిస్ట్రార్లు పీ శ్రీనివాస్, సురేంద్రబాబు, సంపత్కుమార్, రామచంద్రంలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిపై వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ (ఐజీ) ఆదేశాలతో ఉమ్మడి జిల్లా స్థాయిలో విచారణ కమిటీ ఏర్పాటైంది. విచారణ కమిటీ పరిశీలనలో నలుగురు అధికారుల నిబంధనల ఉల్లంఘన వ్యవహారాలు బయటపడ్డాయి.
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, అనుమతులు లేని లేఅవుట్ స్థలాలు, నాలా కన్వర్షన్ లేని వ్యవసాయ భూములను ఇండ్ల స్థలాలుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ పీ శ్రీనివాస్ 688 డాక్యుమెంట్లు, సురేంద్రబాబు 174 డాక్యుమెంట్లు, సంపత్ కుమార్ 88 డాక్యుమెంట్లు, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ రామచంద్రం 146 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేశారు. ఈ కమిటీ ప్రతిపాదనల మేరకు గత నెలలో ఇద్దరిని, ఇటీవల మరో ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
వ్యవసాయ భూములను నివాస స్థలంగా మార్చాలంటే ముందుగా భూమి మార్పిడి (నాలా కన్వర్షన్) చేసి, కుడా అనుమతులు తీసుకున్న తర్వాతే నివాస స్థలాలుగా విక్రయించాల్సి ఉంటుంది. నాలా పర్మిషన్ లేనవి, నాన్ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల మేరకు ఉన్న ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బ్యాంకు లోన్లు, ఇంటి నిర్మాణ అనుమతులు సులువుగా వస్తాయి. అనుమతుల కోసం ప్రభుత్వానికి నిర్దేశిత మొత్తాన్ని రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. కొందరు వ్యాపారులు ఇలా చేయకుండానే వ్యవసాయ భూములను ఇండ్ల స్థలాలుగా రిజిస్ట్రేషన్ చేశారు.
వరంగల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న సబ్ రిజిస్ట్రార్లు మాత్రం దీన్ని సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా, కొనుగోలుదారులకు ఇబ్బందులు కలిగేలా వ్యాపారులకు, తమకు మేలు జరిగేలా చేశారు. గజానికి కొంత చొప్పున వసూలు చేసి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేశారు. రైతుల పేరిట ఉన్న భూములను నేరుగా ఇండ్ల ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తంగా దాదాపు 1600 డాక్యుమెంట్లను, పది రోజుల్లోనే 280 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు విచారణలో తేలింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.1200 ఉన్న చోట డ్యాక్యుమెంట్లలో దీన్ని తగ్గించి రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గింది. విచారణ కమిటీ ఈ అంశాలను తేల్చింది. వీటి ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.