ఈ నెల 5న గోవర్ధనోత్సవం
కార్తీక మాసంలో వైష్ణవ సంప్రదాయంలో అన్నకూట మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీనినే గోవర్ధన పూజ అని పిలుస్తారు. వివిధ తినుబండారాలతో గోవర్ధన గిరి ఆకృతిని నిర్మించి, శ్రీకృష్ణుడికి నివేదించి దానిని భక్తులకు ప్రసాదంగా పంచడం ఓ ఉత్సవంగా జరుగుతుంది. గోవర్ధన పూజ ఈనాటిది కాదు. శ్రీకృష్ణ భగవానుడు చూపిన దారిలో బృందావనవాసులు గోవర్ధనగిరిని ఆరాధించారు.
ద్వాపర యుగంలో వ్రజ ప్రజలు సమృద్ధిగా వానలు కురవాలని వర్షాలకు అధిదేవత అయిన ఇంద్రుడి కోసం ఏటా యాగం నిర్వహించేవారు. ఒకసారి ఇంద్రయాగం కోసం గోకులం సమాయత్తం అవుతున్నది. అప్పుడు చిన్ని కృష్ణుడు తన తండ్రి నంద మహారాజు దగ్గరకు వెళ్లి.. ‘ఇంద్రుడు విష్ణువు ఆజ్ఞలు నిర్వహిస్తున్నాడు. వాస్తవానికి వర్షాలను ప్రసాదించేది విష్ణువే! అంతేకాదు, మనకు సమృద్ధిగా పంటలను, ఓషధులను ప్రసాదిస్తున్న గోవర్ధన గిరిని పూజించాల’ని చెబుతాడు. శ్రీ కృష్ణుడి ఆధ్వర్యంలో వ్రజవాసులు గోవర్ధనగిరికి పూజలు నిర్వహిస్తారు. ఈ చర్యతో ఇంద్రుడి అహం దెబ్బతింటుంది. ఏకధారగా వర్షాలు కురిపిస్తాడు. కుండపోత వానలతో ఆ ప్రాంతమంతా కకావికలం అవుతుంది. తన ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు అద్భుతమైన లీలను ప్రదర్శిస్తాడు. చిటికెన వేలుతో గోవర్ధన గిరిని ఎత్తి వ్రజవాసులను సంరక్షిస్తాడు. అదే సమయంలో ఇంద్రుడికి తన స్థానం తెలిసొచ్చేలా చేస్తాడు. తప్పును తెలుసుకున్న ఇంద్రుడు.. శ్రీకృష్ణుడిని శరణువేడుతాడు.
తనను సేవించటం కన్నా, తన ప్రియ భక్తులను ఆరాధించడం తనను మరింత ప్రసన్నుడిని చేస్తుందని గోవర్ధనలీల ద్వారా లోకానికి తెలియజేశాడు శ్రీకృష్ణుడు. గోవర్ధనుడిని పూజించడంతోపాటు గోసంరక్షణ ఆవశ్యకతను కూడా గోవర్ధనోత్సవం తెలియజేస్తుంది. అంతేకాదు జీవకోటి మనుగడకు కారణమైన ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతనూ గుర్తుచేస్తుంది.
‘గిరి’ధర పూజ
శ్రీకృష్ణుడు సమస్తలోకాలకు ఎలా ఆరాధ్య దైవమో, ఆయన ధామమైన బృందావనం, గోవర్ధన గిరి సైతం ఆరాధనీయమైనవే! ఈ విషయాన్ని నిర్ధారిస్తూ గోవర్ధన పర్వతాన్ని ఆరాధిస్తే స్వయంగా తనను పూజించినట్లే అని తెలియజేశాడు శ్రీకృష్ణుడు. ఆనాటి నుంచి నేటి వరకు గోవర్ధన పూజ కొనసాగుతూనే ఉంది. బృందావనం మొదలు దేశదేశాల్లో పలు దేవాలయాల్లో గోవర్ధనోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్నది. గోవర్ధన వైభవాన్ని విన్నవారు సమస్త భాగ్యాలను పొంది, శ్రీకృష్ణుని సన్నిధానాన్ని చేరుకుంటారు.
-శ్రీల ప్రభుపాద దాస
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984