తెలుగు ఆత్మను నిలబెడుతున్న ఖజానా.. తెలంగాణ
హైదరాబాద్, డిసెంబర్ 30: బతుకు పాటను సెలబ్రేట్ చేసినవాడు. నిత్యం మెళకువగా ఉంటూ ‘చిమ్మచీకటిలో మిణుగురు దివ్వె అయినవాడు. పూసిన పూలకు దోసిలొగ్గినవాడు. ఆ వాసన పరిమళానికే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సొంతం చేసుకున్నవాడు. అలతి అలతి పదాలతో అద్భుతాన్ని ఆవిష్కరించినవాడు. అవసరమనుకుంటే అవే పదాలతో రణమూ చేయగలడు. లాలీత్యమూ రంగరించగలడు. అతడే పైడికంటి పాటగాడు, ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. గోరటి వెంకన్న రాసిన ‘వల్లంకితాళం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సుదీర్ఘ సాహితీ ప్రయాణంలో సాహిత్య అకాడమీ దక్కటం పట్ల మీ స్పందన..
‘నేననగా నేనెంతవాడను. నియ్యపు జీవులలోన’ అంటడు అన్నమాచార్యుడు. నాకు అవార్డు వచ్చింది అంటే అది ఇచ్చినవాళ్ల గొప్పతనం. ఈ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రసాహిత్య అకాడమీకి కృతజ్ఞతలు. ‘నియ్యతి క్రమములలోన నిత్యము నన్ను నేను తరియిస్తాను’ అంటారు ఠాగూర్. కనుక నాకు వచ్చిన అవార్డుకు వినమ్రంగా ఆనందపడటం తప్ప మరేమీ చేయలేను. సంచారమెంత బాగున్నదనే తత్వం నా జీవనసారం. పాల్కురుకి సోమనాథుడి నుంచి కాళోజీ దాకా.. ఆముక్త మాల్యద నుంచి కృష్ణశాస్త్రి దాకా.. గుర్రం జాషువా నుంచి గద్దరన్న దాకా అందరి పరంపర.. అన్నమాచార్యుడు.. వీరబ్రహ్మం వాగ్గేయ సంప్రదాయం అన్నీ కలగలసిన.. ఎంతోమంది నాటిన జ్ఞానవృక్షం కింద ఓనమాలు నేర్చుకుంటున్న సంచారిని నేను.
జానపద సాహిత్యంలో మీకు మాత్రమే పరిమితమైన శైలిని మీరు సృష్టించారని అంటారు.. నిజమేనా?
జనసాహిత్యం, సంస్కృత సాహిత్యం, పాళీ, ప్రాకృత, గిరిజన సాహిత్యం వేటికవే ప్రత్యేకం. వైయక్తిక అనుభూతులు, సమాజంలో జరిగే చలనాల మధ్య సంఘర్షణలో ఇమడలేక కవి, రచయిత తనను తాను ఆవిష్కరించుకున్నదే సాహిత్యం. నా కన్నా ముందు నుంచే జనానికి అర్థమయ్యేలా ప్రతిభావంతంగా చెప్పిన ఎందరో మహాత్ములున్నారు. ఎంతోమంది ప్రభావం నామీద ఉందని బలంగా నమ్ముతా. కవిత్వమైనా, జీవితమైనా.. నిన్ను నీవు తెలుసుకోవటమే. ఇది నాకే పరిమితమైంది అని నేనెప్పుడూ అనను. నాదంటూ ఫలానా శైలీ అంటూ లేదు.
వల్లంకితాళం నేపథ్య ఇతివృత్తాలను వివరిస్తారా?
తెలంగాణ నేపథ్యంగా ‘పూసిన పున్నమి’, ‘ఏకునాదం’ దళితసాహిత్యం, విప్లవోద్యమ ప్రభావంగా, ‘రేలపూతలు’, ప్రపంచీకరణ నేపథ్యంగా ‘అల సెంద్రవంక’ రాశాను. వల్లంకితాళం గ్లోబల్ మార్కెట్ విస్తరిస్తున్న క్రమాన్ని ప్రతిబింబిస్తుంది. అడవి.. మనిషి మధ్యలోని జీవనసారమే వల్లంకితాళం. మన బతుకు, మనం పుట్టిన నేల స్వభావంలోంచి ఇది వచ్చింది. ఇందులో జీవితం ఉంది. జీవితంపై పెత్తనం చేసే సామ్రాజ్యవాదముంది. మనిషికి ప్రకృతికి మధ్య ఉండే బంధం ఉంది.
కొత్తగా సాహిత్య రంగంలోకి వచ్చేవాళ్లకు మీరేం చెప్తారు?
ఎవరికీ ఏం చెప్పాల్సిన పనిలేదు. ఎవరికితోచిన ఘర్షణను వారు అక్షరీకస్తారు. కవిత్వం అంటే సకల అసమానతలు.. సకల ఆధిపత్యాలను రూపుమాపడం. సాహిత్యం అంటేనే సమస్త కృత్రిమత్వాలకు దూరంగా, సహజంగా, ఆకాశంలోని నక్షత్రాల వలె, వెన్నెలపాలవంటి కాంతి వలె ఉండాలని నమ్ముతాను. ఒక దశలో ‘చిమ్మ చీకటిలోన మినుగురైనా దివ్వె’ గేయం రాసిన. ప్రక్రియ ఏదైనా ఈ అనంత విశ్వంలో కవితాత్మకం కానిది ఏదీ ఉండదు. ప్రకృతిలో ప్రతిదీ కవితాత్మకమే. దాన్ని మనం జీవించే క్రమంలో మనకు తోచిందేదో రాస్తాం. మనల్ని మనం ఆవిష్కరించి రాసేది కవిత్వం.
కవి, గాయకుడు, వాగ్గేయకారుడు.. వీటిల్లో మీకేదంటే ఎక్కువ ఇష్టం?
భూ ప్రపంచంలో పాటలు రాయకపోతే బతుకలేకపోతునేమో. నా వెనుక బలం లేదు. బలగం లేదు. అయినా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నరు. నన్ను నేను ఫలానా అని గిరిగీసుకొని ఉండను. పరివ్యాప్తమైన ఈ అనంత విశ్వంలో నేనొక ఆవగింజంత. ఎట్ల పిలిచినా పలుకుత. అయితే కవిగా మొత్తం నాకు తెలిసింది అనుకుంటే అక్కడితో ఆ కవిపని అయిపోయినట్టే.
ఎమ్మెల్సీగా ఎదగటానికి మీ సాహితీ ప్రయాణమే దారి వేసిందని అనుకోవచ్చా?
పెద్దాయన (కేసీఆర్) కవిగనె నన్ను గుర్తించిండు. సాహిత్యంలో అపారమైన నిష్ణాతుడు ఆయన. ప్రపంచ తెలుగు మహాసభలోనే వారు (కేసీఆర్) నా పాట పాడి నా కీర్తిని ఆకాశానికి ఎత్తినారు. అంతకంటే ఎక్కువ ఏముంటది? టంగుటూరి ప్రకాశం పంతులు, కరుణానిధి లాంటి అతి కొద్దిమందికి సాహిత్య నేపథ్యం ఉంది. ఈ కాలంలో మనసారు (కేసీఆర్) వారిని మించిన ధారణ, వాక్పటిమ, అభినివేశం తనలో ఇముడ్చుకొన్నారు. పెద్దాయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. నన్ను పెద్దలసభకు పంపినారు.
స్వరాష్ట్రం సాకారమైన తర్వాత రాష్ట్రంలో భాషా వికాస పరిణామంపై మీ కామెంట్!
తెలంగాణ సాహిత్య వికాసం.. స్వరాష్ట్రంలో దేదీప్యమానంగా వెలుగుతున్నది. ‘సాహితీ అభినివేశం ఉన్నవాళ్లు పాలకులైనచోట సాంస్కృతిక పునరుజ్జీవనం పరిఢవిల్లుతుందని జాన్యార్క్ అంటాడు. దానికి తెలంగాణ నిదర్శనం. సాహితీ అభినివేశమే కాకుండా సకల వ్యవస్థలపై అపారమైన జ్ఞానసంపద కలిగిన పాలకుడు కేసీఆర్. కనుక అన్ని రంగాలతోపాటు భాషా వికాసం పరిమాణాత్మకంగా.. గుణాత్మకంగా వృద్ధి చెందుతున్నది. భాషకే కన్నుకుట్టేలా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు.. గొప్ప కవి సిధారెడ్డి, సకలజనుల కవి జూలూరు గౌరీశంకర్ వంటి వాళ్లను దానికి అధ్యక్షులుగా చేశారు. తెలంగాణ ఇవ్వాళ దేశాన తలెత్తుకొని తిరుగుతున్నది. మన భాష.. యాస.. రాష్ర్టాలు రెండు. కానీ మనది తెలుగు ఆత్మ. ఆ ఆత్మను నిలబెడుతున్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది అందరూ అంగీకరించే సత్యం.
‘పల్లే కన్నీరు పెడుతుందో’ నాటి పరిస్థితులు ఇప్పుడేమైనా పోలిక..
పల్లే పన్నీరు కురిపిస్తుంది ఇవ్వాళ. బాధ కలిగితే.. బాధనే రాస్తం. ఆనందం కలిగితే బాగుందనే రాస్తం. ఎంతో మెరుగైంది. చిమ్మచీకటిలో మినుగువెలుతురైన దివ్వె అని రాసిన. ఆకురాలు కాలమెపుడు ఆవహించ వేకువ మొగ్గలు తొడిగి వెలుతురవ్వు.. అట్లా ఏమాత్రం వెలుగు కనిపించినా దాన్ని దర్శించాలె. చీకటిని చీల్చి చెండాడాలె అన్నట్టుగానే ఉంట. బతుకులు మనతోనే మొదలు కాలే.. మనతోనే
అంతమవ్వవు.