సిరుల తల్లి, సౌభాగ్యాల కల్పవల్లి లక్ష్మీదేవికి ఇంగ్లండ్లోనూ అపార గౌరవం దక్కింది. దీపావళి అమ్మకాల కోసం ఆ దేశంలోని రాయల్ మింట్ తొలిసారిగా లక్ష్మీదేవి బొమ్మ ఉన్న బంగారం బిస్కెట్లను విడుదల చేసింది. సెప్టెంబర్ 28 నుంచి వీటిని అమ్మకానికి ఉంచారు. 20 గ్రాముల బంగారు బిస్కెట్పై రెండు ఏనుగుల మధ్యలో పద్మంపై నిలబడిన లక్ష్మీదేవిని
సునిశితంగా చెక్కారు. రాయల్ మింట్ డిజైనర్ ఎమ్మా నోబుల్ దీని రూపకర్త. కార్డిఫ్లోని స్వామి నారాయణ్ దేవాలయం తనవంతు సహకారం అందించింది. ఇంగ్లండ్లో నెలకొన్న మత వైవిధ్యానికి గుర్తింపును ఇవ్వడంలో భాగంగా లక్ష్మీదేవి బొమ్మను బంగారు బిస్కెట్పై చెక్కించినట్టు మింట్ ప్రతినిధులు వెల్లడించారు. దీని వెల 1,080 పౌండ్లుగా నిర్ణయించారు. మన రూపాయల్లో దాదాపు 1,10,000కు సమానం. దీపావళికి ఇచ్చే కానుకల్లో బంగారం శుభప్రదమైంది. కాబట్టి అందానికి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే ఆధునికతను మేళవించి రూపొందించామని రాయల్ మింట్ డైరెక్టర్ (విలువైన లోహాల విభాగం) ఆండ్రూ డిక్కీ వెల్లడించారు. నవంబర్ 4న స్వామి నారాయణ్ ఆలయంలో ఈ బంగారు బిస్కెట్ను లక్ష్మీపూజలో ఉంచనున్నారు.