సిటీబ్యూరో, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నగరానికి పచ్చందాన్ని, పచ్చదనాన్ని అద్దేలా జీహెచ్ఎంసీ కృషి చేస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. ప్రత్యేక కార్యాచరణతో పర్యావరణహితంగా, పచ్చని నగరంగా హైదరాబాద్ ప్రపంచంలోనే ప్రాముఖ్యతను తీసుకువచ్చిన అధికారులు 2020-21వ సంవత్సరం ఏడో విడత హరితహారంలో కోటి 20 లక్షల నిర్ధేశిత టార్గెట్లో కోటి 9 లక్షలకు పైగా మొక్కలు నాటి పథకం పూర్తిగా విజయవంతం దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే 2021-22వ సంవత్సరానికి గాను 8వ విడతలో కోటి 20 లక్షల మొక్కలే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్శిటీ విభాగం అధికారులు రంగంలోకి దిగారు.
వంద శాతం గ్రీనరే లక్ష్యంగా చేపడుతున్న పనుల్లో 900 కాలనీలకు గాను పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా పనులను పూర్తి చేసి 8వ విడత హరితహారం మొక్కల పెంపకం పనులను ప్రారంభించి వచ్చే ఏడాది తొలకరి జల్లులు కురిసే నాటిని నిర్దేశిత మొక్కలను సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎనిమిదో విడత హరితహారం లక్ష్యాలపై డిసెంబర్ 1న జరిగే ప్రత్యేక సమావేశంలో చర్చించి పూర్తి నివేదికతో సన్నద్ధమవుతామని చెప్పారు. కాగా, ఈ ఏడాది సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, శేరి లింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్ల పరిధిలో 600 నర్సరీలలో కోటి మొక్కలను సిద్ధం చేసి, నర్సరీల ద్వారా ఆసక్తి గల హరితప్రియులకు మొక్కలను పంపిణీ చేశారు.
గతంలో కంటే ఎక్కువ శాతం మొక్కలను నాడటంపై ప్రత్యేక దృష్టి సారించిన జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్శిటీ విభాగం ఖాళీ స్థలాలతో పాటు రహదారుల వెంబడి మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ విరివిగా చేపట్టారు. ఉస్మానియా సెంట్రల్ యూనివర్శిటీ, ఎన్జీఆర్ఐలతో పాటు ఎక్కువ స్థలాలున్న సంస్థలు, ఖాళీ స్థలాలున్న దేవాదాయ శాఖ భూములలో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటారు. ప్రధానంగా రహదారుల వెంబడి, మెట్రో కారిడార్లలో మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ కనువిందు చేస్తున్నది.
ప్రత్యేక ఆకర్షణగా ప్లాంటేషన్…
ప్రధాన రహదారుల వెంబడి నాటుతున్న మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. మియాపూర్ బస్ డిపో, బీకే ఎన్క్లేవ్ రోడ్, రాందేవ్ గూడ నుంచి నెక్నాంపూర్ రోడ్, మల్కాజిగిరి సర్కిల్లోని జెడ్టీసీ నుంచి ఎన్ఎఫ్సీ వరకు ఈ ప్లాంటేషన్ను చేపట్టారు. ఆరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ వరకు పనులు తుది దశలో ఉన్నాయి. రహదారులకు ఇరువైపులా అధిక విస్తీర్ణంలో ఉన్న స్థలంలో పూల మొక్కలైన తీగ జాతి మొక్కలు కాగితం పూలు, పూల పొదల మొక్కలు మొదటి వరుసలో, ఒక ఫీట్ వరకు ఎదిగే పొగడ, బిజ్జోనియా మెగాఫొటమికా జాతి మొక్కలు, చివరి వరుసల్లో ఏపుగా పెరిగి నీడనిచ్చే వేప, రావి, మర్రి తదితర చెట్లను నాటారు. ఈ విధానంతో ముందుగా కనువిందు చేసే పూల మొక్కలు, రెండు మూడు ఫీట్లు దట్టంగా పెరిగే మొక్కలు, చివరగా ఏపుగా పెరిగే చెట్ల ద్వారా ఆయా మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు వాహనదారులకు ఈ మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ కనువిందుగా కన్పిస్తున్నాయి. మల్టీ లేయర్ ప్లాంటేషన్ పద్ధతిలో వివిధ పుష్పాల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్లు, సువాసన వెదజల్లే మొక్కలు వాహనదారులు, ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
కాలనీలకు పచ్చందనమై..
గ్రేటర్ హైదరాబాద్లోని కాలనీల్లో వంద శాతం గ్రీనరీ లక్ష్యంగా జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. వంద శాతం వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం స్ఫూర్తితో 100 శాతం పచ్చదనం ఉండేలా పనులు చేపట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు, నగరంలోని 4,846 కాలనీలలో వంద శాతం మొక్కల నాటడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. కాలనీలలో ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసిన పచ్చదనంతో కళకళలాడేలా ఫ్రూట్స్, ఫ్లవరింగ్ మొక్కలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారు.