సికింద్రాబాద్, డిసెంబర్ 8 : త్రివిధ దళాల చీఫ్, జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ) హెలికాప్టర్ ప్రమాదంలో బుధవారం మరణించడంతో సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్ పరిధిలో విషాదచాయలు అలుముకున్నాయి. 2017లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మూడు సార్లు నగరానికి వచ్చారు.
2017 డిసెంబర్లో సికింద్రాబాద్లో ప్రతిష్టాత్మక కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ (సీడీఎం)ను సందర్శించారు. డిసెంబర్ 17న సీడీఎం సందర్శనలో భాగంగా హయ్యర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కోర్సు (హెచ్డీఎంసీ)లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో ఆర్మీ ప్రాముఖ్యత, అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా ఆర్మీ పనితీరును మెరుగుపరుచుకోవడంపై పలు కీలక సూచనలు చేశారు.
2017లో నగర శివారులోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీని సందర్శించారు. పైలట్స్ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్ 199వ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగాహాజరయ్యారు.
2018 డిసెంబర్లో మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ)ను సందర్శించారు. డిసెంబర్ 14న తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ 99వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంసీఈఎంఈలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మిలటరీ అధికారులకు పట్టాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.
2019 తర్వాత జనరల్ బిపిన్ రావత్ సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్ను సందర్శించ లేదు. అయితే ఇక్కడి ప్రతిష్టాత్మక శిక్షణ సంస్థలకు సంబంధించిన కార్యక్రమాలకు వెబినార్ ద్వారా హాజరయ్యే వారు.