ముంబై, నవంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లను మళ్లీ కరోనా భయాలు చుట్టుముట్టాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూస్తున్న కొవిడ్-19 కొత్త రకం బీ.1.1.529 ఆందోళనలు భారతీయ మదుపరుల్లోనూ కనిపించాయి. అత్యధిక మ్యూటెంట్లు కలిగిన ఈ వైరస్.. ప్రస్తుతం ప్రమాదకారిగా భావిస్తున్న డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలనీ హెచ్చరించింది. ఫలితంగా శుక్రవారం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ఒక్కసారిగా కుప్పకూలాయి.
ఉదయం ఆరంభం నుంచే తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్న ఇన్వెస్టర్లు.. ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,687.94 పాయింట్లు లేదా 2.87 శాతం క్షీణించి 57,107.15 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 1,801.2 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 509.80 పాయింట్లు లేదా 2.91 శాతం పడిపోయి 17,026.45 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ విలువ 6.01 శాతం క్షీణించింది.
మారుతి, టాటా స్టీల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, టైటాన్ షేర్లూ నష్టపోయాయి. అయితే డాక్టర్ రెడ్డీస్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు 3.32 శాతం లాభపడ్డాయి. ఇక రంగాలవారీగా రియల్టీ, మెటల్, ఆటో, బేసిక్ మెటీరియల్స్, ఇండస్ట్రీ సూచీలు 6.42 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలూ 3.23 శాతం వరకు దిగజారాయి.
ఆసియా, ఐరోపాల్లోని ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే కదలాడటం కూడా భారతీయ మార్కెట్లను ముంచేసింది. చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా, జపాన్ సూచీలు 2.67 శాతం మేర పడిపోయాయి. ఐరోపాలోని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల స్టాక్ మార్కెట్లూ 3.51 శాతం వరకు కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర కూడా 5.62 శాతం తగ్గి 77.60 డాలర్లకు చేరింది.
దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్ దేశాల్లో కొత్త వేరియంట్ కలకలం
మళ్లీ ఆంక్షల వైపు బ్రిటన్, జపాన్ వంటి అగ్రదేశాలు
కరోనా భయాలకు తోడైన ద్రవ్యోల్బణం ఆందోళనలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కఠిన ద్రవ్య విధానం అంచనాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేక చతికిలపడిన మెజారిటీ రంగాల షేర్లు
కరోనా కొత్త రకంపై కేంద్రం చేసిన హెచ్చరికలతోనూ పెరిగిన నష్టాల తీవ్రత
లాభాల స్వీకరణే ధ్యేయంగా కదిలిన విదేశీ సంస్థాగత మదుపరులు
సెన్సెక్స్ ఇప్పటిదాకా వెయ్యి పాయింట్లకుపైగా 13సార్లు నష్టపోయింది. ఇందులో 9 గతేడాదే సంభవించగా, ఈ ఏడాది రెండుసార్లు పడిపోయింది. ఇవన్నీ కూడా కరోనా భయాల వల్లే కావడం గమనార్హం. శుక్రవారం నమోదైనది సెన్సెక్స్ చరిత్రలో 8వ భారీ పతనం. నిరుడు మార్చిలో అత్యధికంగా 3,935 పాయింట్లు క్షీణించింది.
రూపాయి విలువకూ కరోనా సెగ తగిలింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం ట్రేడింగ్లో 37 పైసలు పడిపోయింది. గురువారం 74.52 వద్ద ముగిసిన దేశీయ కరెన్సీ.. శుక్రవారం 74.89 వద్దకు పడిపోయింది. ఫలితంగా దాదాపు నెల రోజుల కనిష్ఠ స్థాయిని నమోదు చేసినైట్లెంది. అక్టోబర్ 28 తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. కాగా, ఒకానొక దశలో 74.92 స్థాయికి కూడా రూపాయి విలువ పతనం కావడం గమనార్హం.
దేశీయ స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలు.. మదుపరుల సంపదను పెద్ద ఎత్తున కరిగించేశాయి. బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే రూ.7.35 లక్షల కోట్లకుపైగా ఆవిరైపోయింది. కరోనా కొత్త రకం భయాల మధ్య మదుపరులు లాభాల స్వీకరణకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో బీఎస్ఈ మదుపరుల సంపద రూ.7,35,781. 63 కోట్లు దిగి, రూ.2,58,31,172.25 కోట్లకు పరిమితమైంది. గురువారం కూడా దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు రూ.2,300.65 కోట్ల పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. ఇదిలావుంటే ఈ వారం మొత్తం గా సెన్సెక్స్ 2,528.86 పాయింట్లు, నిఫ్టీ 738.35 పాయింట్లు
పడిపోయాయి.