గరిడేపల్లి, అక్టోబర్ 20: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని వెలిదండ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత కొల్లు వరప్రసాదరావు(92) కన్నుమూశారు. వయోభారంతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. మునగాల మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కేసగాని ముత్తయ్యకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఆయనకు కీలకమైన సమాచారాన్ని అందించేవారు. సాయుధ పోరాటంలోనూ తనవంతు పాత్ర పోషించారు. ప్రజలను చైతన్యం చేసేందుకు అనేక కళా ప్రదర్శనల్లోనూ పాలుపంచుకున్నారు. పేదలకు సాయమందించడంలోనూ ముందుండేవారు. తన స్నేహితుడు రేపాల నర్సింహరావుతో కలిసి లక్ష రూపాయలను బ్యాంక్లో డిపాజిట్ చేసి ఏటా వచ్చే వడ్డీతో పేద విద్యార్థుల చదువుకోసం అందించేవారు. అనేక అభ్యుదయ రచనలు చేశారు. తన మరణం తర్వాత దేహాన్ని ఖమ్మంలోని మమత దవాఖాన వైద్య విద్యార్థులకు అందించాలని ముందుగానే వీలునామా రాశారు. ఆయన మరణంతో వెలిదండలో విషాదఛాయలు అలుముకున్నాయి.