కుత్బుల్లాపూర్, డిసెంబర్ 6: కుత్బుల్లాపూర్ పరిధి బాచుపల్లిలో మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్లో ఈ నెల 8, 9 తేదీల్లో ఉచితంగా గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల పరీక్షలు చేపడుతున్నట్లు డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్లు తెలిపారు. సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ మరణాల పెరుగుదల కారణంగా వాటిని నియంత్రించడంలో భాగంగా సేవా దృక్పథమైన బాధ్యతతో ప్రజలకు మెరుగైన జీవన శైలిని అందించేందుకు ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ ఆస్పత్రిలో అలాంటి వారి కోసం ప్రత్యేక సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైన వారు రెండు రోజుల పాటు జరిగే ఉచిత క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డాక్టర్ ఉషానాగ్, డాక్టర్ చండ్రు స్వరూప, డాక్టర్ మాల్యాద్రిలు పాల్గొన్నారు.