జీడిమెట్ల, డిసెంబర్ 15 : కొత్త బ్యాంక్ను సృష్టించారు. స్విస్ బ్యాంక్ తరహాలో భద్రత ఉంటుందన్నారు. కోట్లలో నగదు పెట్టుబడి పెడితే వేల కోట్లు వెనకేసుకోవచ్చని నమ్మించారు. మీ ఖాతాలు బ్యాంక్ డైరెక్టర్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఉంటాయని చెప్పిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఉద్యోగి మరికొందరితో చేతులు కలిపి రూ.250 కోట్లు వసూలు చేశాడు. సృజన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పేట్బషీరాబాద్ పోలీసులు, బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం షాపూర్నగర్లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ పి.వి.పద్మజా మీడియాకు వివరాలు వెల్లడించారు.
నగరంలోని దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన ప్రేమ్కిశోర్ గతంలో ఐసీఐసీఐ బ్యాంక్లో ఇంటి రుణాల మంజూరు విభాగంలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో ఢిల్లీ బ్యాంక్లో గృహరుణాలను కేవలం 3 శాతం వడ్డీకే ఇస్తున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. అక్కడ ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ పేరుతో మోసాలు చేస్తున్న ఓ ముఠాతో పరిచయం ఏర్పడింది. తిరిగి నగరానికి వచ్చిన అనంతరం కర్ణాటకకు చెందిన ప్రియరంజన్, డి.సత్యనారాయణ, విశాల్ జి సక్పాల్, సుశాంత్ ప్రేమ్ దాస్ గౌరవ్లు కలిసి మోసాలకు తెరలేపారు.
సెకండ్ చానల్ అకౌంట్ పేరుతో పెట్టుబడి పెడితే స్విస్ బ్యాంక్ తరహా భద్రతతో పాటు అతి తక్కువ సమయంలోనే వేల కోట్లు కూడబెట్టుకోవచ్చని నమ్మించారు. ఈ క్రమంలో పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉంటున్న సృజన్ అనే వ్యక్తిని కలిసి సెకండ్ చానల్ అకౌంట్ ద్వారా ట్రేడింగ్ చేయవచ్చని నమ్మించారు. తమ దగ్గర ఉన్న సెకండ్ చానల్ ఖాతాలో రూ.10వేల కోట్లు నగదు జమ ఉన్నట్లు నకిలీ స్టేట్మెంట్ పత్రాలను చూపించారు. ట్రేడింగ్ చేసేందుకు అంత నగదు తమ దగ్గర లేదని.., మీరు పెట్టుబడి పెడితే మూడు రెట్ల నగదు ఇస్తామని నమ్మబలికారు.
వారి మాటలు నమ్మిన సృజన్ రూ.కోటికి పైగా నగదు పెట్టుబడి పెట్టాడు. ఆరు నెలలు గడిచినా.. నగదు తిరిగి రాకపోవడంతో బాధితుడు పేట్బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులు కె.ప్రేమ్కిశోర్, ప్రియారంజన్ నాయక్ అలియాస్ అజయ్ పాల్సింగ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1.31 కోట్ల నగదు, ఓ కారు, మూడు సెల్ఫోన్లు, ఒక ల్యాప్ట్యాప్ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.
ఫోన్ కాల్ వస్తే.. వేల కోట్లలోనే లావాదేవీలంటూ మాట్లాడుతారు. ఫైవ్ స్టార్ హోటళ్లలోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ సమావేశాలకు పలువురిని ఆహ్వానిస్తుంటారు. వారి ఆర్భాటం చూస్తే ఎవరైనా.. నమ్మాల్సిందే. వారు ఎంచుకున్న వ్యక్తులను ఢిల్లీకి తీసుకువెళ్తారు. బ్యాంక్ల నకిలీ పత్రాలను సృష్టించి స్టేట్మెంట్లు, ఖాతాల వివరాలను వారికి అందజేస్తారు. ఈ మాయగాళ్లు ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.250 కోట్లు వసూలు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఎవరైన ఈ తరహాలో మోసపోతే ఫిర్యాదు చేయాలన్నారు. పేట్బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సీఐ రమేశ్, బాలానగర్ ఎస్ఓటీ సీఐ జెమ్స్బాబు, పోలీస్,ఎస్ఓటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.