మా ఎన్నికలు సాధారణ ఎన్నికల కన్నా రసవత్తరంగా మారతాయనే అనుమానం కలుగుతుంది. ప్రతిసారి ఇద్దరు మాత్రమే పోటీ పడే వారు కానీ ఈ సారి మాత్రం ఏకంగా నలుగురు అధ్యక్ష బరిలో ఉన్నారు. నిజంగా అందరికీ మంచి చేయాలని ఉన్నప్పుడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు కదా.. ఎందుకు అందరు పోటీకి సై అంటున్నారు.. నువ్వా నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు అంటూ ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్ద మనుషులు కూడా ప్రశ్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ అధ్యక్షుడు పోటీ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత.. కేవలం ఒక రోజు గ్యాప్ లో మంచు విష్ణు, జీవిత, హేమ లాంటివాళ్ళు కూడా మా ఎలక్షన్స్ లో నిలబడి ఉన్నట్లు ప్రకటించారు.
పోటీలో నలుగురు కనిపిస్తున్న కూడా ఇద్దరి మధ్య ఎక్కువగా ఈ వార్ జరిగేలా అనిపిస్తుంది. చిరంజీవి కుటుంబం అండదండలతో ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో దిగుతున్నాడు. మరోవైపు కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జీవితకు ఎవరు ప్రచారం చేస్తారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక సీనియర్ నటి హేమ సంగతి పెద్దగా పట్టించుకున్నట్లు కూడా అనిపించడం లేదు. అయితే ఈ నలుగురు మాత్రం మా అసోసియేషన్ కు మంచి చేయడమే తమ లక్ష్యమని అంటున్నారు.
కేవలం 950 నుంచి 1000 మంది మధ్యలో ఉండే సభ్యుల కోసం నలుగురు అధ్యక్ష బరిలో దిగడం నిజంగానే విచిత్రంగా అనిపిస్తుంది. ఈ పాటికే ఎన్నికలు జరగాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయింది. ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. అప్పుడే నువ్వా నేనా అనుకుంటున్నారు. కేవలం రెండేళ్లు మాత్రమే ఈ పదవి కోసం చాలా ప్రయత్నిస్తున్నారు సీనియర్ నటులు. ఒకరేమో బిల్డింగ్ పెడతాం అంటున్నారు.. మరొకరు అందరికీ ఆరోగ్య సూత్రం అంటున్నారు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో హామీ ఇస్తున్నారు. చివరికి ఎవరు ఈ సారి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపికవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన 25 ఏళ్లలో ఒక్కసారి కూడా చతుర్ముఖ పోటీ జరగలేదు. మహా అయితే ఇద్దరు పోటీ పడ్డారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా నలుగురు బరిలో దిగుతున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో మరింత రసవత్తరంగా ఉండబోతున్నాయి.