ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఘటనలు
కల్లూరు/డిండి, అక్టోబర్ 17: ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన ఘటనల్లో నీట మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో అమ్మవారి నిమజ్జనం సందర్భంగా ఇద్దరు, నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టులో మునిగి మరో ఇద్దరు మరణించారు. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన్నపాలేనికి చెందిన శ్రీగంధం మధులత (26) దసరా పండుగకు తల్లిగారి ఊరైన కల్లూరు మండలం రఘునాథబంజరకు వచ్చింది. శనివారం రాత్రి అమ్మవారి నిమజ్జన కార్యక్రమానికి హాజరైంది. విగ్రహాన్ని సాగర్ కాలువలో నిమజ్జనం చేస్తుండగా మధులత ప్రమాదవశాత్తు జారి కాలువలో పడింది. ఆమెకు చేయి అందించే క్రమంలో రఘునాథబంజరకు చెందిన పసుపులేటి శివ(22) కూడా కాలువలో పడిపోయాడు. గల్లంతైన ఆ ఇద్దరి కోసం స్థానికులు, పోలీసులు గాలించారు. అర్ధరాత్రి మధులత, ఆదివారం మధ్యాహ్నం శివ మృతదేహాలు లభించాయి. పండుగ కోసం పుట్టింటికి వచ్చిన మధులత మృతిచెందగా.. హైదరాబాద్లోని మేనమామ వద్ద వ్యాపారం చేస్తూ పండుగ కోసం సొంతూరుకు వచ్చిన శివ.. మధులత ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో మరణించాడు. మధులతకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇద్దరిని బలి తీసుకున్న సెల్ఫీ సరదా
నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్ట్ స్పిల్వే ముందు భాగంలో సెల్ఫీ తీసుకుంటుండగా నీటిలో జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్(23), హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన మహ్మద్ సాగర్(21), వంగరి విశాల్, బీ బలరాం, పకాలి వంశీ, కటిక అనిల్కుమార్ ఈ నెల 15న మూడు బైక్లపై హైదరాబాద్ నుంచి శ్రీశైలం టూర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం డిండి ప్రాజెక్ట్ను సందర్శించారు. ప్రాజెక్ట్ స్పిల్వే భాగంలో సెల్ఫీ తీసుకుంటుండగా మహ్మద్ సాగర్ నీటిలో జారిపడ్డాడు. కాపాడేందుకు ప్రవీణ్కుమార్ నీటిలోకి దూకగా సాగర్ అతడిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. పైనున్న స్నేహితులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేపల వల వేసి బయటకు తీసి నీటిని కక్కించారు. కొన ఊపిరితో ఉన్న వారిని దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.