సిటీబ్యూరో, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): ఇంకా ఎన్ని రోజులు కష్టపడతాం…వేగంగా డబ్బులు సంపాదించాలని ఇద్దరు పాత నేరస్తులు చేసిన ఆలోచనతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల టార్గెట్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసాలకు పాల్పడుతున్న నలుగురిని రాచకొండ ఎస్వోటీ, హయత్నగర్ పోలీసులు బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్లోని రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కర్మన్ఘాట్కు చెందిన మద్దెలమడుగు వరకుమార్, యాతకుల ప్రమోద్ కుమార్ చర్లపల్లి జైలులో స్నేహితులయ్యారు.
2016లో ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని వరకుమార్ చైతన్యపురి పోలీసుస్టేషన్ నుంచి, 2017లో యాతకుల ప్రమోద్కుమార్ నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లను తయారు చేసి సరూర్నగర్ పోలీసుస్టేషన్ నుంచి అరెస్టు అయ్యి చర్లపల్లి జైలుకు వెళ్లారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత 2020లో కలిసిన వీరు వేగంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను టార్గెట్ చేశారు. వీరికి లండన్లో ఉన్నత చదువులను మధ్యలో మానేసి హైదరాబాద్కు వచ్చిన వెన్ను దినకర్రెడ్డి పరిచయమయ్యాడు. అతనికి కంప్యూటర్ ద్వారా అపాయింట్మెంట్ పత్రాలను తయారు చేసే పరిజ్ఞానం ఉంది. వీరు ప్రభుత్వ లోగోల ముద్రలను తయారు చేసేందుకు విప్పర్తి ప్రకాష్కు ఒక స్టాంప్కు రూ.1000 ఇస్తామని ఆశపుట్టించారు.
అనంతరం కర్మాన్ఘాట్లో లెమిని కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న ఖాసీమ్ను పరిచయం చేసుకుని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. ఇందుకు జూనియర్ అసిస్టెంట్కు రూ. 3 లక్షలు, డాటా ఎంట్రీ ఆపరేటర్కు రూ. 1.20 లక్షలు, అటెండర్కు రూ. 1.10 లక్షల ధరను ఫిక్స్ చేశారు. ఇలా వీరిని నమ్మిన లెమిని కన్సల్టెన్సీ నిర్వహకుడు తన బావకు పంచాయతీ రాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇప్పించాలని రూ. 1.10 లక్షలు డబ్బులు చెల్లించాడు. హయత్నగర్కు చెందిన ఓ యువతి నుంచి న్యాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తానని రూ. 1.10 లక్షలు తీసుకున్నారు.
ఇలా దాదాపు 24 మంది నుంచి రూ. 27 లక్షలు వసూలు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్వోటీ అధికారులు, హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి నిందితుల గుట్టును బయటపెట్టారు. ఈ నలుగురు నిందితుల నుంచి రూ. 5.70 లక్షల నగదు, 53 ఫేక్ రబ్బర్ స్టాంప్లు, నకిలీ అపాయింట్మెంట్ లేఖలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రాచకొండ ఎస్వోటీ డీసీపీ సురేందర్ రెడ్డి, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రవికుమార్, హయత్నగర్ ఇన్స్పెక్టర్ సురేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.