న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఏఈ) గా పనిచేసిన అరవింద్ సుబ్రమణియన్ అశోక విశ్వవిద్యాలయానికి రాజీనామా చేశారు.
ప్రముఖ కాలమిస్ట్, పొలిటికల్ వ్యాఖ్యాత ప్రతాప్ భాను మెహతా నిష్క్రమించిన కొద్ది రోజులకే అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2019
జూలై నెలలో పీబీ మెహతా అశోక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ, అరవింద్ అదే యూనివర్సిటీలో బోధన కొనసాగించారు.
అశోక విశ్వవిద్యాలయం అప్పటి ప్రధాన సలహాదారు మాలబికా సర్కార్ను తదుపరి వైస్-ఛాన్సలర్గా నియమించారు.
2014 నుంచి 2018 వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రమణియన్.. ప్రొఫెసర్ పిబి మెహతా రాజీనామా చేయడంతో విశ్వవిద్యాలయం నుంచి తాను కూడా నిష్క్రమించవలసి వచ్చింది అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
సుబ్రమణియన్ గత ఏడాది జూలైలో అశోక విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా చేరారు. కొత్తగా ఏర్పాటుచేసిన అశోక సెంటర్ ఫర్ ఎకనామిక్ పాలసీ వ్యవస్థాపక డైరెక్టర్ కూడా వ్యవహరించారు.
పీబీ మెహతా విశ్వవిద్యాలయం వీసీ పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల తరువాత తాను కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. విద్యా స్వేచ్ఛ, వ్యక్తీకరణను రక్షించడంలో విశ్వవిద్యాలయం అసమర్థతతో మెహతా నిష్క్రమణ ముడిపడి ఉన్నదని విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ మాలబికా సర్కార్కు సంబోధిస్తూ రాసిన లేఖలో సుబ్రమణియన్ స్పష్టం చేశారు. ప్రియమైన స్నేహితుడే కాకుండా నిజంగా స్ఫూర్తిదాయకమైన జాతీయ వ్యక్తి అయిన ప్రొఫెసర్ ప్రతాప్ భాను మెహతా రాజీనామాకు సంబంధించిన పరిస్థితులు నన్ను సర్వనాశనం చేశాయని అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తయిన తర్వాత అమలులోకి రానున్నదని విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.