మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పర్యటన
తరలివెళ్లిన ఎమ్మెల్యే కంచర్ల, నల్లగొండ మున్సిపల్ పాలక వర్గం
క్షేత్రస్థాయిలో 10 గంటలకుపైగా పనుల పరిశీలన
మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ టాప్
వరంగల్ అభివృద్ధి రోల్ మోడల్
పట్టణాభివృద్ధిలో మంత్రి కేటీఆర్కు సాటిలేరు
నీలగిరి, ఫిబ్రవరి 2 : మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అభివృద్ధిలో రాష్ర్టానికి వరంగల్ రోల్ మోడల్గా నిలిచిందని చెప్పారు. అందుకు కేసీఆర్ తీసుకున్న ముందుచూపు నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని నుడాగా మార్చిన నేపథ్యంలో వరంగల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి నల్లగొండలో నిర్మాణాలు చేపట్టేందుకు గాను మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నల్లగొండ, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్లు డా.కేవీ రమణాచారి, రామానుజులరెడ్డి, పబ్లిక్ హెల్త్, టూరిజం ఇంజినీర్ల బృందం బుధవారం వరంగల్ పర్యటకు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. ఈ సందర్భంగా వరంగల్ పట్టణంలోని పలు కూడళ్లు, రోడ్లు, అంబేద్కర్ జంక్షన్, నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం, భద్రకాళీ బండ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్మిస్తున్న నిర్మాణాలు కాకతీయ, కాళోజీ, ఆచార్య జయశంకర్ చరిత్రకు ప్రతిరూపాలని అభివర్ణించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మహమ్మారిని పారదోలిన ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ఉద్యమాలతోపాటు అభివృద్ధికి ఓరుగల్లు దిక్సూచిగా నిలిచిందన్నారు. పట్టణాబివృద్ధిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ఎవరూ సాటిలేరని కితాబిచ్చారు. ప్రపంచ దేశాల నుంచి అందుతున్న ప్రశంసలు, ఆహ్వానాలు అందుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. అంతకుముందు వరంగల్ పట్టాణానికి విచ్చేసిన బృందానికి అంబేద్కర్ జంక్షన్ వద్ద స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఘన స్వాగతం పలికారు. మంత్రి వెంట రెడ్క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.