బీజింగ్, జూన్ 29: ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలో హ్యూమనాయిడ్ రోబోలతో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. శనివారం రాత్రి బీజింగ్లో నిర్వహించిన ఫైనల్స్ పోటీల్లో షింజువా యూనివర్సిటీకి చెందిన ‘టీహెచ్యూ రోబోటిక్స్’ జట్టు చాంపియన్గా నిలిచింది. ఫైనల్స్లో ‘టీహెచ్యూ’ జట్టు 5-3 స్కోర్తో చైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన ‘మౌంటేయిన్ సీ’ జట్టును ఓడించింది. పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తి కలిగిన హ్యూమనాయిడ్ రోబోలతో ఫుట్బాల్ లీగ్ను నిర్వహించటం ప్రపంచంలోనే ఇదే మొదటిసారిగా ‘గ్లోబల్ టైమ్స్’ వార్తా కథనం పేర్కొన్నది. హ్యూమనాయిడ్ రోబోలతో కూడిన నాలుగు జట్లు, బీజింగ్లోని ఇజాంగ్ డెవలప్మెంట్ జోన్లో నిర్వహించిన రోబో ఫుట్బాల్ టోర్నమెంట్లో తలపడ్డాయి. ప్రతి జట్టులోని మూడు హ్యూమనాయిడ్ రోబోలు ఏఐ టెక్నాలజీ, సెన్సార్లపై ఆధారపడి పోటీలో పాల్గొన్నాయి. ఎటువంటి మానవ జోక్యం, పర్యవేక్షణ లేకుండా రోబోలు తమ ఆట ఆడాయని నిర్వాహకులు చెప్పారు. చైనా మరికొద్ది రోజుల్లో 2025 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో స్పోర్ట్స్ గేమ్స్ను కూడా ఇజాంగ్ డెవలప్మెంట్ జోన్లో నిర్వహించబోతున్నది.