సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : ఒక్క క్లిక్ చాలు.. నచ్చిన వంటకాలు సెకన్లలో దర్శనమిస్తాయి. నిమిషాల్లో ఇంటికి చేరుతాయి. ఈ సౌలభ్యంతోనే ఫుడ్ రవాణా ఆధారిత యాప్లపై కస్టమర్లు అధికంగా ఆధారపడుతున్నారు. స్వీట్ నుంచి బిర్యానీ వరకు సర్వం ఆన్లైన్ సేవలతోనే పొందుతున్నారు. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే ఫోన్ తీసి యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టేస్తున్నారు. తాజాగా డిసెంబర్ 31న (శుక్రవారం) ఒక్కరోజే ఆర్డర్ల వెల్లువ కొనసాగింది. సుమారు వంద కోట్ల విలువైన ఆహారపదార్థాలను యూజర్లు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచారు. నిమిషానికి 17వేల ఆర్డర్లు రాగా.. అందులో బిర్యానీయే టాప్లో నిలిచి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. స్విగ్గీ, జొమాటో యాప్లు ఒక్క రోజే తలో 20 లక్షల ఆర్డర్లు పొందాయి. ఈ విషయాన్ని సంబంధిత సీఈవోలు ట్విటర్వేదికగా వెల్లడించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.
హైదరాబాద్లో జోరుగా..
నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, నిత్యావసర దుకాణాలు డిసెంబర్ 31న ఆన్లైన్ గిరాకీతో కళకళలాడాయి. ఒక్క డెలివరీ బాయ్ రోజుకు సుమారు 40 ఆర్డర్లు చేస్తే.. శుక్రవారం మాత్రం 85కు పైగా ఆర్డర్లు డెలివరీ చేసినట్టు డెలివరీ బాయ్ రమేశ్ తెలిపారు. సంస్థలు 31 డిసెంబర్, జనవరి 1 ఈవ్ పేరుతో డెలివరీ బాయ్స్కు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వరుసగా 5 గంటలకుపైగా యాప్ సర్వీస్ సేవలు అందించడం, 50కిపైగా ఆర్డర్స్ చేయడం తదితర సంస్థ నిబంధనలు ఫాలో అయిన వారికి ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఈ కారణంతో చాలా మంది డెలివరీ బాయ్స్ 2021 చివరి రోజున వందల్లో డెలివరీ చేసి అధికంగా ఇన్సెంటివ్స్ పొందడం విశేషం.
స్విగ్గీకి నిమిషానికి 9 వేల ఆర్డర్లు వచ్చాయి. అందులో బిర్యానీ ప్రథమ స్థానంలో ఉండగా బటర్నాన్, పనీర్ బటర్ మసాలా, చికెన్ ైఫ్రైడ్రైస్ తదితర వంటకాలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ 31న 5,500 ఆర్డర్లు రాగా, ఈ సారి 9050 ఆర్డర్లు తమ యూజర్ల నుంచి పొందింది. నిమిషానికి 1300 బిర్యానీలను డెలివరీ చేసింది. మరోయాప్ జొమాటో కూడా అదే స్థాయిలో ఆర్డర్లను రిసీవ్ చేసుకుంది. నిమిషానికి 8వేల ఆర్డర్లు పొందింది. రోజులో మొత్తం 20లక్షల ఆర్డర్లను రిసీవ్ చేసుకుందని సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది.
ఇక 5శాతం కస్టమర్లపేనే..
ఇన్ని రోజులు ఫుడ్ డెలివరీ యాప్లు 5 శాతం జీఎస్టీని రెస్టారెంట్ల నుంచి వసూలు చేసేవి. ఇక మీదట కస్టమర్ల నుంచే వసూలు చేయనున్నాయి. జనవరి 1నుంచి ఇది అమలయింది. ఈ ప్రభావం కస్టమర్లపై పడనుందని నిపుణులు భావిస్తున్నారు. రెస్టారెంట్లపై విధించిన జీఎస్టీని కస్టమర్ల నుంచి వసూలు చేయడం ప్రతక్ష్యంగా కస్టమర్పై ప్రభావం చూపదు. కానీ జీఎస్టీ పేరుతో సంస్థలు అనేక పేర్లతో ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్డర్స్ పెరిగాయి
డిసెంబర్ 31న ఆర్డర్లు అధికంగా వచ్చాయి. నిమిషం కూడా సమయం లేకుండా సందేశాలు ఫోన్కు చేరాయి. హుటాహుటిన ఆర్డర్స్ కస్టమర్లకు చేర్చడంలో బిజీ అయ్యాం. ఆర్డర్స్ ఎక్కవగా చేస్తే ఇన్సెంటివ్స్ అధికంగా ఉంటుంది. ఎక్కువ సమయం సర్వీస్లో ఉంటే కూడా ఇన్సెంటివ్స్ వస్తాయి. నేను వీలున్నప్పుడు యాప్ ఆన్ చేసి సుమారు 20 ఆర్డర్లు పూర్తి చేసేవాణ్ని. డిసెంబర్ 31న ఎక్కువ వస్తాయని తెలిసి మొత్తం డే డ్యూటీలో ఉన్నాను. 80 ఆర్డర్స్ చేశాను. అందులో అధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్లే ఎక్కువగా ఉంది. ఇలాంటి పండుగ రోజుల్లో డెలివరీ బాయ్స్కు బాగా కలిసొస్తుంది.
రాత్రి 1 వరకు అందించాం
ఫుడ్ ఆర్డర్స్ రాత్రి 1 వరకు అందించాను. మేము పార్టీ చేసుకోవాలని భావించాం. కానీ ఆర్డర్ల వెల్లువ చూశాక డ్యూటీతోనే పార్టీ చేసుకోవాల్సి వచ్చింది. ఈ సారి ఆన్లైన్ ఫుడ్కు చాలా డిమాండ్ పెరిగింది. ఆర్డర్స్ అధికంగా రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. చివరి రోజు కావడంతో డ్యూటీ దిగే సమయం అందరం కలుసుకుని ఎన్ని ఆర్డర్లు చేశామని ఆరా తీసుకున్నాం. సంతోషంగా ఇంటికి వెళ్లాం.