నమస్తే తెలంగాణ,నెట్వర్క్, జూలై 5 : వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం..నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందగా ఒకకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం .. ఏపీలోని కాకినాడ జిల్లా భానుగుడి మండలం శ్రీరాంనగర్కు చెందిన మలిరెడ్డి వీరవెంకటనాగరవరప్రసాద్బాబు హైదరాబాద్లోని మధురానగర్లో నివాసం ఉంటున్నారు. అతడి భార్య విజయలక్ష్మి (40), కూతురు శ్రియ (17), కుమారుడు ప్రభవ్ (12), గుండ్లపోచంపల్లిలో నివాసం ఉండే స్నేహితుడు కట్టా శ్రీకర్ప్రసాద్ (62)తో కలిసి చైన్నైకి వెళ్లి తిరిగి హైదరాబాద్కు కారులో వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ని పెద్దకాపర్తి శివారులోకి చేరుకోగానే వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతి వేగంగా వీరి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయలక్ష్మి, శ్రియ, ప్రభవ్, శ్రీకర్ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న వరప్రసాద్కు తీవ్రగాయాలయ్యాయి. సీఐ సురేశ్, ఎస్సై ఘటనాస్థలానికి చేరుకొని వరప్రసాద్ను నార్కట్పల్లి సమీపంలోని కామినేని దవాఖానకు, మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ శరత్చంద్ర ప్రవార్ సందర్శించి, వివరాలు తెలుసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని జాతీయ రహదారి 44పై శనివారం అర్ధరాత్రి అనంతపురం నుంచి జమ్ముకశ్మీర్ వెళ్తున్న లారీ.. ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలుకాగా 108 సిబ్బంది కర్నూల్ దవాఖానకు తరలించారు. వీరిలో చిన్నబసవ, వినీత, నవీన్కుమార్రెడ్డి, జ్యోతి, ఘాజీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గేటు సమీపంలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై శ్రీశైలం వైపునుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టిన ఘటనలో పలువురికి గాయాలు కాగా స్థానికులు అచ్చంపేట సర్కార్ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు.మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ మలుపు వద్ద ఎన్హెచ్-167 పై మంగళూరు నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వస్తున్న భారతి ట్రావెల్స్ వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి రాయిచూర్ వైపు వెళ్తున్న మినీ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనగా,ట్రక్కు డ్రైవర్ ట్రక్కులో ఇరుక్కొని మృతి చెం దాడు. బస్సు డ్రైవర్, ప్రయాణికులకు గాయాలయ్యా యి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రక్కులో ఇరుక్కుపోయిన డ్రైవర్ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై భాస్కర్రెడ్డి తెలిపారు.