International Physics Olympiad | అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ (IPhO- International Physics Olympiad) ఐదుగురు భారతీయ విద్యార్థులు సత్తా చాటారు. వీరు అగ్రస్థానంలో నిలిచి ఐదు బంగారు పతకాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పాఠశాల స్థాయి భౌతికశాస్త్ర (Physics) పోటీల్లో ఈ ఒలింయాడ్ ఒకటి. దీనిలో భారత్ నుంచి పుణెకు చెందిన కనిష్క్ జైన్, ఇండోర్కు చెందిన రిద్దేశ్ అనంత్ బెందాలె, న్యూ ఢిల్లీకి చెందిన రిషిత్ గార్గ్, ముంబైకు చెందిన శ్రేష్ట్ సురైయా, అహ్మదాబాద్కు చెందిన స్వరిత్ జోషి పాల్గొన్నారు.
దీనిలో భారత్ చైనా, కజకిస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, తైవాన్లతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకుని స్వర్ణ పతకాలు గెలుచుకుంది.
బంగారు పతకాలు గెలుచుకున్న ఐదుగురిలో నలుగురు కనిష్క్ జైన్, రిద్దేశ్ బెందాలె, రిషిత్ గార్గ్, స్వరిత్ జోషి కోటా (రాజస్థాన్)లోని అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు.
వీరిని భారత ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో అభినందించారు. వారి ఈ ఘనత మన యువశక్తి అపరిమితమైన సామర్థ్యానికి, విజ్ఞానశాస్త్రం, పరిశోధనల పట్ల వారికున్న అభిరుచికి మరో నిదర్శనం అని కితాబిచ్చారు.
56వ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ కొలంబియాలోని బుకరమంగలో జూలై 4 నుంచి 12 వరకు నిర్వహించారు. ఈ పోటీలో 87 దేశాల నుంచి 381 మంది విద్యార్థులు పాల్గొన్నారు.