న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంగ్స్ కమిషన్ ట్విట్టర్ ఖాతా హ్యాకైన ఘటనలో ఇవాళ ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏప్రిల్ 10వ తేదీన రాత్రి 1.30 నిమిషాలకు యూజీసీ ట్విట్టర్ ఖాతా హాకైనట్లు ఎఫ్ఐఆర్ కాపీలో రాశారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో యూజీసీ స్వయంప్రతిపత్త సంస్థగా నడుస్తోంది. ట్విట్టర్ సంస్థకు కూడా యూజీసీ ఫిర్యాదు ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే యూజీసీకి ఆక్సెస్ ఇచ్చారు. హ్యాకైన సమయంలో సుమారు 24 వేల స్పామ్ ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను డిలీట్ చేసినట్లు ట్విట్టర్ సంస్థ వెల్లడించింది. యూజీసీ ట్విట్టర్కు సుమారు 2.98 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూజీసీ స్వయం ప్రాజెక్టు ఐటీ కన్సల్టెంట్ అభిశేఖ్ కుమార్ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులను నమోదు చేశారు. ఐటీ చట్టంలోని 66, 66సీ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.