హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 33 మంది విదేశాల్లో తలదాచుకొంటున్నారు. వీరిపై సీబీఐతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. వీరిలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, నీశాల్ మోదీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోదీ, నితిన్ జే సందేసరా, దీప్తి చేతన్కుమార్ తదితరులున్నట్టు తెలిపింది. ఈ నిందితులకు చెందిన రూ.47,099 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు వివిధ కోర్టుల్లో 115 కేసులు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. వీరిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నది. వీరిని భారత్కు తిప్పిపంపాల్సిందిగా ఇంటర్పోల్ను కోరినట్టు 2018 జూలై 25న కేంద్ర మంత్రి వీకే సింగ్ లోక్సభకు తెలిపారు. ఇది జరిగి మూడున్నరేండ్లు గడుస్తున్నా ఇంకా 28 మంది ఆర్థిక నేరగాళ్లు విదేశాల్లోనే జల్సాలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. నిందితుల జాబితాను ఆదివారం మీడియా సమావేశంలో విడుదల చేశారు. వీరిలో ఎక్కువ మంది గుజరాతీయులే ఉండటం గమనార్హం.
బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలె
33 మంది ఆర్థిక నేరగాళ్లు ఇప్పుడెక్కడున్నరు? మోదీ ప్రభుత్వం సాధించిన అద్భుతమైన ప్రగతి ఏమిటంటే బ్యాంకును ముంచిన ప్రతి ఒక్కరూ లండన్లో పిక్నిక్ చేయొచ్చు. వీళ్లందరిపై సీబీఐ కేసులు పెట్టిన తరువాత దేశం నుంచి పారిపోయిండ్రు. విజయ్మాల్యా, నీరవ్మోదీ, లలిత్ మోదీ, నితిన్ సందేశ్ వీళ్లంతా దేశం నుంచి వెళ్లింది నిజం కాదా? వీళ్లంతా మోదీ దోస్తీలు. చాలామంది గుజరాతీయులే. ఏమనాలె దీన్ని? ఇది మీ ప్రభుత్వ ప్రతిభ కాదా? మీ దేశభక్తికి తార్కాణం కాదా? ఏమనుకోవాలె? ఇవన్నీ కఠోరమైన వాస్తవాలు కాదా? ఇదా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదంతా గత డిసెంబర్ సెషన్లో పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో ఉంది. ఎవడెవడు పోయిండు? ఎంతమంది పోయిండ్లు? అన్నీ పార్లమెంటుకు భారత ప్రభుత్వం చెప్పింది. కఠోరమైన వాస్తవాలు ఈ విధంగా ఉంటే.. ట్రోలింగ్ చేసి దిక్కుమాలిన క్షుద్ర సోషల్మీడియాను పెట్టుకొని ఎవలను పడితేవాళ్లను, ఎంతపడితే అంత మాటలు అంటరు. ఇదా పద్ధతి? అందుకే బీజేపీ మస్ట్ గో ఫ్రం దిస్ కంట్రీ. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలె.
-సీఎం కేసీఆర్