హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బీసీ గణన చేపట్టాలనే డిమాండ్తో డిసెంబర్ 13,14,15 తేదీల్లో ఢిల్లీలో బీసీ సంఘాలు తలపెట్టిన ఆందోళనకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు మద్దతు ప్రకటించారు. బీసీ గణనకు టీఆర్ఎస్ ఇప్పటికే మద్దతు ప్రకటించిందని, శాసనసభలో కూడా తీర్మానం చేసిందని కేశవరావు గుర్తు చేశారు. బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్లో కేశవరావుతో సమావేశమయ్యారు.
ఢిల్లీలో ‘బీసీ జంగ్ సైరన్’ పేరుతో నిర్వహించనున్న ఆందోళనకు 29 రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున తరలిరానున్నారని జాజుల శ్రీనివాస్ వివరించారు. ఈ ఆందోళనలో టీఆర్ఎస్ తరఫున హాజరుకావాలని కేశవరావును కోరారు. బీసీ గణన కోసం పార్లమెంట్ వేదికగా కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు కృషిచేస్తామని కేశవరావు హామీ ఇచ్చినట్టు జాజుల తెలిపారు. ఈ సందర్భంగా బీసీల చలో ఢిల్లీ పోస్టర్ను కేశవరావు ఆవిష్కరించారు.