న్యూఢిల్లీ, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించడంతో శుక్రవారం రైతులు సంబురాలు చేసుకొన్నారు. రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన కేంద్రాల వద్ద మిఠాయిలు, జిలేబీలు పంచిపెట్టారు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతం ఘాజీపూర్ నుంచి ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతం సింఘు ప్రాంతం వరకు పండుగ వాతావరణం నెలకొన్నది. సిక్కుల గురువు గురు నానక్ జయంతి నాడే మోదీ ప్రకటన వెలువడటంతో ఆందోళనకారుల ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది.