హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి విస్తృతస్థాయిలో ప్రాజెక్టులను చేపట్టినట్టు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టులపై ఆయన సోమవారం తమశాఖ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహబూబ్నగర్లో ఎకో టూరిజం సర్క్యూట్, వరంగల్లో ట్రైబల్ సర్క్యూట్, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేటలో టూరిజం హోటల్స్, ఎకో టూరిజం అభివృద్ధి కోసం కోటి లింగాల దేవాలయం దగ్గర పర్యాటకులకు సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. అలాగే హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూంబ్స్, ట్యాంక్బండ్లో నీరా కేఫ్ ప్రాజెక్టు, పీవీ నరసింహారావు ఘాట్పార్క్, అలంపూర్లో టెంపుల్ సర్క్యూట్, మహబూబ్నగర్లో మినీ శిల్పారామం అభివృద్ధి, జూరాల ప్రాజెక్టు దగ్గర పార్క్, టూరిస్ట్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ టూరిజం మరింత అభివృద్ధి చెందనున్నదని చెప్పారు. ఈ సమావేశంలో టీఎస్టీడీసీ ఎండీ డీ మనోహర్, ఈడీ శంకర్రెడ్డి, ఓఎస్డీ మధుసూదన్, ఎస్ఈలు అశోక్, సరిత తదితరులు పాల్గొన్నారు.