బ్యాట్తో లంకేయులను ఊచకోత కోసిన రవీంద్ర జడేజా.. బంతితో మరో ప్రళయం సృష్టించాడు! జడ్డూ చేతి నుంచి బంతి విడుదలవడం.. లంక ఆటగాళ్లు వికెట్ కోల్పోవడం యాక్షన్ రీప్లేలా సాగిన ఆటలో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. సుడులు తిరిగే బంతులతో మనవాళ్లు ప్రత్యర్థిని రెండుసార్లు చుట్టేయగా.. జడేజా ఒక్కడు కొట్టిన స్కోరు లంకేయులంతా కలిసి తొలి ఇన్నింగ్స్లో చేయలేకపోయారు! విరాట్ వందో టెస్టు రెండో ఇన్నింగ్స్లోనైనా శతకం
సాధిస్తాడేమో అనుకుంటే.. రోహిత్సేనకు మరోమారు బ్యాటింగ్ చేసే అవకాశమే లేకుండా లంక ఫాలోఆన్లో పడగా.. రెండోసారి కూడా మన బౌలర్ల విజృంభణతో తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది!
మొహాలీ: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రవీంద్ర జడేజా (175; 5/41, 4/46) లంకతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. బ్యాటింగ్లో భారీ సెంచరీతో అలరించిన జడ్డూ.. బౌలింగ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టి లంకను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-0తో ముందంజలో నిలిచింది. రెగ్యులర్ టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మకు ఇదే తొలి విజయం కాగా.. వందో టెస్టులో విరాట్ కోహ్లీకి సహచరులు చక్కటి కానుకనిచ్చారు. బ్యాటర్లంతా దంచికొట్టడంతో రోహిత్ సేన 574/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ఓవర్నైట్ స్కోరు 108/4తో ఆదివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 174 పరుగులకు ఆలౌటైంది. పాథుమ్ నిషాంక (61 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మిగిలినవాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. భారత బౌలర్లలో జడేజా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. బుమ్రా, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఫాలోఆన్ ఎదుర్కొన్న లంక రెండో ఇన్నింగ్స్లో 178 పరుగులకు ఆలౌటైంది. డిక్వెలా (51 నాటౌట్) ఫర్వాలేదనిపించగా.. మిగిలినవాళ్లు పెవిలియన్కు వరుస కట్టారు. మన బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం నుంచి బెంగళూరు వేదికగా రెండో టెస్టు (డే అండ్ నైట్) ప్రారంభం కానుంది.
స్వదేశంలో భారత్కు తిరుగులేదనేది వాస్తవమే అయినా.. తొలి టెస్టులో రోహిత్సేనకు లంక ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. కొండంత లక్ష్యం ముందుండటంతో అప్పటికే మానసికంగా వెనుకబడి పోయిన లంకేయులు.. శనివారం కాస్త పోరాడినా.. ఆదివారం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఎప్పుడెప్పుడు పెవిలియన్ చేరుదామా అనే తొందరలో కనిపించారు. ఓవర్నైట్ ఆటగాళ్లు నిషాంక, అసలంక (29) కాసేపు క్రీజులో నిలువగా.. ఆ తర్వాతి వాళ్లు కనీస ప్రతిఘటన కనబర్చలేకపోయారు. డిక్వెలా (2), సురంగ లక్మల్ (0), లసిత్ ఎంబుల్దెనియా (0), విశ్వ ఫెర్నాండో (0), లహిరు కుమార (0) డగౌట్కు క్యూ కట్టారు. దీంతో 174 పరుగులకే లంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. జడ్డూకు ఐదు వికెట్లు దక్కాయి. ఒకే మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టడం జడేజాకు ఇదే తొలిసారి. 400 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో రోహిత్.. లంకను ఫాలోఆన్కు ఆహ్వానించాడు. ఈ సారైన లంకేయులు పోరాడుతారేమో అనుకుంటే అది అత్యాశే అయింది. తిరుమనె (0), కరుణరత్నె (27), నిషాంక (6), మాథ్యూస్ (28), ధనంజయ (30), అసలంక (20), లక్మల్ (0) వరుస విరామాల్లో ఔట్ కాగా.. డిక్వెలా పోరాటం వృథా అయింది.
మూడు రోజుల్లో మ్యాచ్ ముగుస్తుందనుకోలేదు. అన్ని విభాగాల్లో మా జట్టు పైచేయి కనబర్చింది. బ్యాటింగ్ పిచ్పై మనవాళ్ల బౌలింగ్ అద్భుతంగా సాగింది. ఏ దశలోనూ లంక ప్లేయర్లకు అవకాశం ఇవ్వలేదు. స్పిన్నర్లతో పాటు సీమర్స్ కూడా ఒత్తిడి పెంచుతూ పోయారు. విరాట్ కోహ్లీ వందో మ్యాచ్లో విజయం సాధించడం మరింత ఆనందం. ఇది భారత క్రికెట్ జట్టుకు శుభపరిణామం
– రోహిత్ శర్మ, భారత కెప్టెన్
స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (436)ఈ మ్యాచ్తో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్న అశ్విన్.. దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ (434)ను అధిగమించాడు. కపిల్దేవ్ 131 మ్యాచ్ల్లో 434 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 85 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (619) అందరికంటే ముందున్నాడు.
ఈ మైదానం నాకు బాగా కలిసొచ్చింది. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏదో తెలియని శక్తి వస్తుంది. రిషబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడికి స్ట్రయికింగ్ ఇవ్వాలని అనుకున్నా. ఆ క్షణం నా మదిలో ఎలాంటి అంకెలు మెదలలేదు. బ్యాట్తో పరుగులు చేయడంతో పాటు బంతితో రాణించడం మరింత ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు ఆటగాడిగా నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.
– రవీంద్ర జడేజా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
ముంబై: గత సీజన్ ఫైనలిస్ట్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య తొలిపోరుతో టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ఆరంభం కానుంది. ఈనెల 26న ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై, కోల్కతా పోరుతో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీ మే 29న ముగియనుంది. కరోనా కారణంగా ముంబై, పుణెల్లోనే జరుగనున్న ఈ లీగ్ షెడ్యూల్ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. 65 రోజుల్లో మొత్తం 70 లీగ్, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్లు జరుగనున్నాయి. పుణె వేదికగా ఈ నెల 29న రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 574/8 డిక్లేర్డ్ (జడేజా 175, పంత్ 96, అశ్విన్ 61; లక్మల్ 2/90), శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 174 ఆలౌట్ (నిషాంక 61; జడేజా 5/41, బుమ్రా 2/36), శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 178 ఆలౌట్ (డికెవెలా 51 నాటౌట్; జడేజా 4/46, అశ్విన్ 4/47).
ఐపీఎల్ 15వ సీజన్ షెడ్యూల్