మేడ్చల్, జనవరి 4: చిన్నారుల వ్యాక్సినేషన్ కార్యక్రమం మేడ్చల్ నియోజకవర్గంలో రెండో రోజు కొనసాగింది. ఆయా మండలాలు, మున్సిపాలిటీల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల్లో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు టీకా తీసుకున్నారు. వైద్య సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లతో టీకా వేస్తున్నారు.
పీర్జాదిగూడలో 113 మందికి వాక్సిన్
పీర్జాదిగూడ : పీర్జాదిగూడ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 113 మందికి పిల్లలకు టీకా వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ ప్రతిభ తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని ఈ సందర్భంగా వైద్యాధికారి కోరారు.
కీసరలో 163 మందికి టీకా..
కీసర : కీసరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 163 మంది పిల్లలకు టీకా వేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు సరిత మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం 15 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు టీకా వేశామని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.
ఉమ్మడి శామీర్పేటలో..
శామీర్పేట : 15 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని తూంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు అన్నారు. శామీర్పేట పీహెచ్సీలో 28 మందికి, మూడుచింతలపల్లి పీహెచ్సీలో ఇద్దరు వ్యాక్సిన్ వేశారు. వైద్యాధికారులు శ్రీకాంత్, మనుపప్పన్, దమయంతి, సిబ్బంది పాల్గొన్నారు.