ఆనందం వెల్లివిరిసింది. హోలీ హంగామా అంబరాన్నంటింది. తీరొక్క రంగుల్లో ప్రతి మోమూ ఓ మోదుగు పువ్వై వెలిగింది. కరోనా కారణంగా రెండేండ్ల నుంచి వేడుకలకు దూరంగా ఉన్న చిన్నాపెద్ద శుక్రవారం ఉత్సాహంగా హోలీ ఆడారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, స్నేహితులను కలుపుకొంటూ బైక్లపై యువకులు చక్కర్లు కొట్టారు. రంగులు జల్లుకుని, డీజే పాటలకు స్టెప్పులేసి ఎంజాయ్ చేశారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొని ఉత్సాహం నింపారు. శుభాకాంక్షలు తెలిపారు.
హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. కరోనా భయాలు వెంటాడడంతో రెండేండ్లుగా నామమాత్రంగా జరుపుకొన్న వేడుకలు.. ఈ సారి ఊరూ, వాడ ఉత్సాహంగా సాగాయి. వీధులు, కాలనీల్లో పిల్లలు, పెద్దలు రంగులు జల్లుకుంటూ మురిసిపోయారు. ఇరుగుపొరుగు మహిళలంతా ఒకరికొకరు కలర్స్ పూసుకుని ఆనందాలు పంచుకున్నారు. నాగార్జునసాగర్, హుజూర్నగర్ ఎమ్మెల్యేలు నోముల భగత్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, వినయ్ కృష్ణారెడ్డి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు.