బోధన్, డిసెంబర్ 1: ఇతర పంటల సాగు అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చెరుకు రైతులను ఆదుకొనేందుకు చెరుకు ఆధారిత ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నదని నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ తెలిపారు. తన సొంత పెట్టుబడులతో ప్రైవేట్ రంగంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. బుధవారం బోధన్లో తనను కలిసిన చెరుకు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్రెడ్డి, రైతు నాయకుడు నారాయణరావును ఉద్దేశించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం బోధన్ ప్రాంతంలో 56ఎకరాలను సేకరించానని, ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.146కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామన్నారు. రోజుకు 2 వేల టన్నుల చెరుకును ప్లాంట్ ద్వారా గానుగాడించే అవకాశం ఉంటుందన్నారు. సోయా ఉత్పత్తుల ప్లాంట్ కూడా ఏర్పాటయ్యేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.