హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): దళిత బిడ్డలకు ఈటల రాజేందర్ చేసిన ద్రోహం బట్టబయలైంది. దళితబంధు పథకాన్ని ఆపించింది ఆయనేనని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టంచేసింది. మోహన్ అనే వ్యక్తి పెట్టిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తుకు ఈసీ సమాధానం ఇచ్చింది. ‘దళితబంధు పథకం అమలుపై మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నుంచి సెప్టెంబర్ 24న ఫిర్యాదు అందినట్టు’ తెలిపింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే దళితబంధు పథకం ఎన్నికల నియమావళికి విరుద్ధమని భావించి నిలిపివేసినట్లు పేర్కొంది. మోహన్ అనే వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తుకు, ఎన్నికల సంఘం నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న సమాధానం లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దళితబంధు నిలిపివేతపై నిన్నటివరకు బుకాయించిన ఈట ల గ్యాంగ్కు ఈ లేఖ బహిర్గతం కావడంతో నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది.
దళితవాడలకు వెళ్లి తన వల్లే ఈ పథకం వచ్చిందని ప్రచారం చేసుకొంటున్న ఈటల నిజస్వరూపం బయటపడిందని, తెరవెనుక నుంచి ఈ పథకాన్ని ఆపడానికి ఈటల పన్నిన కుట్రకు ఈ లేఖే తార్కాణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈటల తర్వాత ఈ పథకాన్ని నిలిపివేయాలని బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి కూడా ఈసీకి లేఖ రాశారు. దళితబంధుపై ఈటల , బీజేపీ కుట్రలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యవహారాలు వెలుగు చూడటంతో ప్రజ ల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ వ్యవహారాలు తమకు నష్టం చేకూర్చుతాయని బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. కాగా, సోషల్ మీడియాలో వైరలైన ఈ లేఖపై అటు బీజేపీ కానీ, ఇటు ఎన్నికల సంఘం కానీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం.