హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): హౌసింగ్ బోర్డు, హౌసింగ్ కార్పొరేషన్ సంస్థల విలీనాన్ని స్వాగతిస్తున్నామని టీఎన్జీవో సంఘం ప్రకటించింది. ఈ విలీనం పూర్తయ్యేలోగానే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరింది. ఈ మేరకు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ బుధవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. టీఎన్జీవోల సంఘం హైదరాబాద్ నగరశాఖకు నాంపల్లి గృహకల్ప సముదాయంలో కార్యాలయ ఏర్పాటుకు అనుమతించాలన్న విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సంఘం నేతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీఎన్జీవో హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షుడు శ్రీరామ్, కార్యదర్శి శ్రీకాంత్, హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం నాయకుడు రఘునందన్రావు తదితరులు ఉన్నారు.
పీఆర్సీకి సంబంధించిన జీవోలను జారీచేయాలని టీఎన్జీవో నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో సీఎస్ సోమేశ్కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఈ పథకం అమలు కోసం మూల వేతనంలో 1 శాతం ఇచ్చేందుకు ఉద్యోగులు, పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ఆలయాల్లో దూపదీప నైవేద్యాలతోపాటు అర్చకులకు పారితోషికం చెల్లించేందుకు ప్రభుత్వం రూ. 14,68,55,000 మంజూరుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులను మంజూరుచేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.