తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ఉత్సవాలు ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు టీటీడీ ఇటీవల ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 500 నుంచి 1000 మంది భక్తులను బస్సుల్లో ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని హెచ్డీపీపీ, రవాణా విభాగం అధికారులను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా వేదపారాయణంలో అర్హులైన వారికి పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లు ప్రారంభించేందుకు సీఈఓ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఉత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యంపై వసంత మండపంలో ప్రముఖ పండితులతో ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నాదనీరాజనం వేదికపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు, ఇతర వినూతన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అలిపిరి కాలినడక మార్గాన్ని బ్రహ్మోత్సవాల్లోపు అందుబాటులోకి తేవాలన్నారు. విశ్రాంతి గదుల్లో మాస్ క్లీనింగ్ చేపట్టాలని, మరమ్మతులు పూర్తయిన కాటేజీలను భక్తులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచాలన్నారు. వాహనసేవలు జరిగే ప్రాంతమైన ఆలయంలోని కల్యాణమండపంలో చిన్న బ్రహ్మరథం ఏర్పాటు చేయాలన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు, వీఐపీలకు ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని భద్రతా విభాగం, పోలీస్ అధికారులకు సూచించారు. శ్రీవారి ఆలయం, అన్ని కూడళ్లను శోభాయమానంగా విద్యుద్దీపాలు, పుష్పాలంకరణ చేపట్టాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అన్నప్రసాద భవనంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్న ప్రసాదాలు అందించాలని డెప్యూటీ ఈఓను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు ముందు అక్టోబర్ 5న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. అక్టోబర్ 6న ఉత్సవాలకు అంకురార్పన జరుగుతుందని, బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబర్ 7న ధ్వజారోహణం, 11న గరుడ వాహన సేవ, 12న స్వర్ణరథం (సర్వభూపాల వాహనం), 14న రథోత్సవం (సర్వభూపాల వాహనం), 15న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగుతాయని తెలిపారు. ప్రతి ఏడాదిలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, జేఈఓ సదా భార్గవి, అదనపు ఎస్పీ మునిరామయ్య, అదనపు సీవీఎస్వో శివకుమార్రెడ్డి, ఎఫ్ఏసీఏవో బాలాజీ, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.