హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20న జరుగాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసీఈటీ)-2021 ద్వితీయ, తుదిదశ కౌన్సెలింగ్ గడువును ఈ నెల 30 వరకు పెంచినట్టు కన్వీనర్ గురువారం తెలిపారు. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 20 నుంచి 30 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు. డిసెంబర్ ఒకటిన అర్హుల జాబితా ప్రకటన. డిసెంబర్ రెండు నుంచి మూడు వరకు వెబ్ ఆప్షన్స్. నాలుగున వెబ్ఆప్షన్ల సవరణకు అవకాశం. ఏడున సీట్ల కేటాయింపు. ఎనిమిది నుంచి పది వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంపీసీ విభాగం బీటెక్ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నికల్ కోర్సుల సీట్లు రైతు కోటాలో, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సులో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 30న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ గురువారం వెల్లడించారు. బీటెక్ అగ్రికల్చర్లో ఆరు సీట్లు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 12 సీట్లు, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్లో 27 సీట్ల భర్తీకి ఈ కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఎస్సీ అభ్యర్థులకు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ పరీక్షలకు సంబంధించి ఫౌండేషన్ కోర్సు ఉచితంగా అందిస్తున్నట్టు ఆ సర్కిల్ డైరెక్టర్ గురువారం వెల్లడించారు. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాలలోని స్టడీ సర్కిళ్లలో ఐదునెలలపాటు ఉచిత శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040 235465552 నంబర్లో లేదా www.tsstudycircle.co.in ను చూడాలని సూచించారు.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నేషనల్ లెవల్ ఎగ్జిబిషన్ అండ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ (ఎన్ఎల్ఈపీసీ)లో పాల్గొన్న 33 మంది రాష్ట్ర విద్యార్థులకు వచ్చేనెల మూడున బెంగళూరులో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికతోపాటు ల్యాప్టాప్లు అందించనున్నట్టు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ తెలిపారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ క్యాంపస్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో 8వ ఎన్ఎల్ఈపీసీ విజేతలతో దక్షిణాది రాష్ర్టాల విద్యార్థుల సమావేశం ఏర్పాటుచేస్తామని, ఈ సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలకు ప్రత్యేక రౌండ్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. టీఎస్ ఐసీఈటీ-2021లో అర్హత పొంది గతంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులు, మొదటి, రెండోదశ కౌన్సెలింగ్కు హాజరైనవారు సైతం స్పాట్లో పాల్గొనవచ్చు. ఈ నెల 28, 29 తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకొని 29న ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 30న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందినవారు డిసెంబర్ ఒకటిన ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కైలాశ్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ (కేఎస్సీఎఫ్) దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులతో శుక్రవారం ‘భారత రాజ్యాంగ పీఠిక పఠనం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. దేశవ్యాప్తంగా 20 రాష్ర్టాలు 410 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, అంగన్వాడీల పిల్లలు, బాలల సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలు, కేఎస్సీఎఫ్ బాలమిత్ర గ్రామాలు, మండలాలకు చెందిన పిల్లలు, ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లతోపాటు ట్రస్మా ఆధ్వర్యంలోని 10,500 పాఠశాలల్లో 35 లక్షల మంది విద్యార్థులు, ఐదు లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని కేఎస్సీఎఫ్ తెలంగాణ కోఆర్డినేటర్ చందన తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువు డిసెంబర్ 8 వరకు పొడిగించినట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ గురువారం వెల్లడించారు. దరఖాస్తులు, ఫీజులు, సిలబస్ కోసం వర్సిటీ వెబ్సైట్ చూడాలని సూచించారు.
జూబ్లీహిల్స్, నవంబర్ 25: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఎంటర్పెన్యూర్షిప్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నిమ్స్మే డైరెక్టర్ జనరల్ గ్లోరి స్వరూప తెలిపారు. నిరుద్యోగ యువత నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు యూసుఫ్గూడలోని నిమ్స్మేలో స్వల్పకాల వ్యవధి కోర్సుల ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు 040-23633217, 23633236 ఫోన్ నంబర్లలో లేదా www.nimsme.org వెబ్సైట్ చూడాలని సూచించారు.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): డాక్టర్ ఎస్డీ సుబ్బారెడ్డి రచించిన ‘విద్య గాంధీ తత్వము-వర్తమాన సమాజం లో గాంధీ అభిప్రాయాలు’ అనే పుస్తకాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి ఆవిష్కరించారు. గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో పుస్తకాన్ని అవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్రెడ్డి, గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి రెండునెలల గౌరవ వేతనాలను విద్యాశాఖ విడుదలచేసింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధిం చి 810 మందికి రూ.9.53 కోట్లు విడుదల చేస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.