తెలంగాణలోని వస్తు సంస్కృతి ప్రపంచంలోని ఏ దేశాని కన్నా తక్కువేమీ కాదు, నిజానికి ఆయా దేశాల కన్నా ఎక్కువ. రాసిలో, వాసిలో ఎక్కువ నాణ్యంగా ఉన్నాయి. అందుకే గత డిసెంబర్లో మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్లో పర్యటించినప్పుడు ప్యారిస్ నగరంలో జరిగిన దౌత్య శాఖాధికారులు సమావేశం సందర్భంగా, వారికి తెలంగాణ సాంస్కృతిక సంపదకు నిలయమైన ‘ఆద్యకళ’ మ్యూజియం వస్తువులు, పరికరాలు, పనిముట్లు, కళాఖండాల గురించి, వాటితో మ్యూజియం ఏర్పాటు గురించి ఒక నివేదిక సమర్పించాను.
నేను గత 30 ఏండ్ల నుంచి తెలుగు ప్రాంతాల్లో పరిశోధన, భాషా అధ్యయనం చేస్తున్నా. బుర్రకథలపై పరిశోధన చేసిన. నెల రోజుల కిందట హైదరాబాద్ వచ్చిన. ఈ సారి మారుమూల గూడేల, పల్లెల పర్యటనకు వెళ్లాను. ఆదివాసీ జానపద కళాకారులనెందరినో కలిశాను. ప్రజల కళలు, హస్తకళల ప్రావీణ్యాన్ని చూసి అబ్బురపడ్డాను.
ఈసారి నా పర్యటనలో 2023లో ప్యారిస్లో జరపబోయే ‘తెలుగు సాంస్కృతిక పండగ’ లో మన ఆద్యకళల ప్రదర్శన లక్ష్యం. ‘ఆద్యకళ’ పేరిట సేకరించిన కళాఖండాలను ప్యారిస్లో జరగబోయే తెలుగు పండుగలో కొన్నింటినైనా ప్రదర్శిస్తే తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాల పరిచయం ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, ఘంటాలు, కాగితం చుట్టలు, చర్మం పుస్తకాలు, చెక్క శాసనాల వంటివి అక్కడివారిని అబ్బురపరచ గలవు. పారిశ్రామిక విప్లవానంతరం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన, చెందుతున్న దేశాల్లో యంత్ర సంస్కృతి పెరిగిపోయింది. హస్తకళలు, కళాఖండాల తయారీ తరిగిపోయింది. వందేండ్ల కింది వస్తువులు చూద్దామన్నా లభించడం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి విదేశీయులు ఈ వస్తువులను కొంటున్నారు. వాటికి గిరాకీ పెరిగింది. అందుకే ‘Endangered Archives’ పేరిట ఫొటోలు, వాటి వివరాలు సేకరించి భద్రపరుస్తున్నారు.
రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వస్తు జాలానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. విదేశీ పర్యాటకులు, పరిశోధకులు, ఆసక్తి ఉన్నవారు వరుసకట్టి చూస్తారు. అందుకే ఆదివాసీ, జానపద, దళిత తదితర వర్గాలకు చెందిన అనేక వస్తువులను కాపాడుకోవాలి. 2017లో హైదరాబాద్లో జరిగిన తెలుగు ప్రపంచ మహాసభలకు తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు హాజరయ్యాను. తిరిగి ప్యారిస్కు వెళ్లేప్పుడు అవార్డులను, జ్ఞాపికలను తీసుకెళ్లాను. కానీ ఒక సాంస్కృతిక రూపాన్ని తీసుకెళ్లి దాన్ని ఫ్రాన్స్ దేశంలో మిత్రులకు చూపలేకపోయాను.
2019లో తెలుగు భాషా సంస్కృతులకు చేసిన కృషికి గుర్తింపుగా అంతర్జాతీయ రాష్ట్రపతి పురస్కారం పొందా ను. 2019లో భారత ప్రభుత్వం కుంభమేళా సందర్భంగా ఫ్రాన్స్ నుంచి నన్ను ఆహ్వానించారు. కొన్ని జ్ఞాపకాలను మాత్ర మే తీసుకెళ్లాను. కానీ, 2019లో ఓయూ నాలుగు శాఖలు, తెరవే కలసి చేసిన ‘మూలధ్వని’ కార్యక్రమంలో 250 మంది కళాకారులతో ఎక్కడా జరగని ఒక జానపద ఆదివాసీ సంగీత గోష్టిలో పాల్గొన్నాను. అది నా అధ్యయన నేత్రాలను తెరి పించింది. తెలంగాణ నుంచి ఏదైనా ఒక కానుక ప్రపంచానికి అందవలసి ఉంది. అది ఒక ‘ఎత్నిక్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్’ ప్రదర్శనశాల అయితే బాగుంటుందనిపిస్తున్నది.
పురాతన జీవన సాంస్కృతిక కళాఖండాలు, వస్తువులు, పరికరాల విశిష్టతను గుర్తించడంలో కష్టం ఉంటుంది. వాటిని సేకరించడం కూడా క్లిష్టమే. సేకరించిన వస్తువుల వివరాలు పరిశోధన చేసి రాయాలి. వాటిని దృశ్య శ్రవణ మాధ్యమాలలో చూపించాలి, వినిపించాలి. ఇంతగా శ్రమపడేవారు లేరు. విశ్వవిద్యాలయం/ ప్రత్యేక కేంద్రం ప్రత్యేకంగా పనిచేయాలి. అంత పనిచేయడం కేవలం కొద్ది నిధుల వల్ల సాధ్యం కాదు. ఉద్యోగులను నియమిస్తే పని సాగదు. అందుకు ఉత్సుకత, తపన ఉండాలి. త్యాగభావం కావాలి. కొండా కోనా, ఊరూరా తిరిగి వస్తువులను సమాచారాన్ని సేకరించాలి. ఒకే వస్తువును అనేక కోణాల నుంచి చూడాలి. ఏది మ్యూజియంలో పెడితే చూపరులను ఆకర్షిస్తుందో తెలియాలి. అలా అంతిమ ఫలితాన్ని ఊహించగలిగిన వారే సేకరణకు అర్హులు. ఈ పని శిక్షణ పొందిన సంస్థలు చేయాలి. ‘ఆద్యకళ’ పేరుతో ఇలాంటి వేలాది వస్తువులు సేకరించి ఉన్నవాటిని హైదరాబాద్లో నేను చూశాను. తెలంగాణ మూలాల్లో, తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఏపీ వంటి రాష్ర్టాల సరిహద్దుల ప్రాంతాల్లో ఫ్రొఫెసర్ జయధీర్ తిరుమల్రావు 2,500 వస్తువులను సేకరించి సిద్ధంగా ఉంచారు. వాటిని ఐదు మ్యూజియం విభాగాలుగా చేయవచ్చు. 1.ఆది అక్షరం (తెలుగు ఇతర లిపులు, భాషా సాహిత్య వ్యవస్థలకు సం బంధించిన వస్తుజాలం. 2.ఆదిలోహ కళాకృతులు (ఇత్తడి, ఇను ము వంటి లోహాలతో చేసిన అతి ప్రాచీన విగ్రహాలు, మూర్తులు, పరికరాలు మొదలైనవి. 3. ఆది ధ్వని (ఇంతవరకు కనీవినీ ఎరగని సంగీత వాద్యాలు). 4.ఆది చిత్రం (ఆదివాసుల పగిడెలు, జానపదుల అతిపెద్ద పటాలు, బొమ్మలు, నాకాశీ విగ్రహాలు మొదలైనవి. 5.ఆది జీవితం (ప్రాచీన కాలం నుంచి గత యాభై ఏండ్ల కిందటివరకు వాడిన ఇసిరెలు, వ్యవసాయ పనిముట్లు, వృత్తుల వారి పరికరాలు మొదలైనవి. ‘ఆద్యకళ’ పేరుతో ఐదు మ్యూజియాలకు సంబంధించిన వస్తువులు చాలా ఉన్నాయి. వీటికి మరికొన్ని జతచేయాలి.
భారత ప్రభుత్వం గిరిజన వర్సిటీలను ఏర్పాటుచేస్తున్నది. కాని వాటికి అనుబంధంగా వస్తు ప్రదర్శన శాలలను వాటిలో భాగం చేయలేదు. యూజీసీ ఆధ్వర్యంలో/ మార్గదర్శకత్వంలో రూపొందే సంస్థలలో ఈ అంశాలకు చోటుండదు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖలో మాత్రమే మ్యూజియాలకు గ్రాంటు ఇచ్చే అవకాశం ఉంది. అయితే అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం స్థలం, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. అప్పుడే మ్యూజియం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
రాబోయే కాలంలో హైదరాబాద్, తెలంగాణ ప్రపంచ పర్యాటకులకు విహారభూమి కానున్నది. అందుకే ఇక్కడ కొన్ని మ్యూజియంల ఏర్పాటుకు చొరవ చూపాలి. అప్పుడే హైదరాబాద్ నగరానికి, రాష్ర్టానికి విలువ పెరుగుతుంది. ఇవి ఒక దేశానికి, రాష్ట్రానికి, ప్రాంతానికి విశిష్ట సాంస్కృతిక కేంద్రాలుగా పేరు ప్రఖ్యాతులు తెస్తాయి. ఈ మ్యూజియంలతో ఈ దేశంలో గల ఆదివాసీ, దళిత, వెనుకబడిన ప్రజల జ్ఞాన, లలితకళల, కళారూపాల ప్రతిరూపాలలో ప్రజలు తమని తాము చూసుకొని సంతృప్తి చెందుతారు. వీటిని విదేశీయులు తప్పక ఆదరిస్తారు. గౌరవిస్తారు.అందుకోసం తెలంగాణ సాంస్కృతిక సంపదకు మ్యూజియం నిర్మాణం చేయాలి. దీనిపై సీఎం కేసీఆర్ దృష్టిపెడితే తరతరాల కళలకు, సంస్కృతికి పట్టం కట్టినట్లే. ఒక సాంస్కృతిక వెలుగుల కేంద్రం నిర్మించినట్లే. కోట్లాది దేశ విదేశీ పర్యాటక, సాంస్కృతిక రంగం అభిమానుల హృదయాలను రాబోయే వందల ఏండ్లు గెలిచినట్లే.
భౌతిక అవసరాలే కాదు ఒక కొత్త జాతికి/ ప్రాంతానికి సాం స్కృతిక జీవితానికి సంతృప్తి కూడా అవసరమే. అందుకే మా దేశం ఫ్రాన్స్లో ఎన్నోరకాల మ్యూజియాలున్నాయి. లక్షలాది మంది వాటిని తిలకిస్తారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి దీర్ఘకాలం నిలిచే రూపం ఇవ్వగలగడం క్రాంత దర్శిత్వమే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ను మా దేశం ఫ్రాన్స్ను సందర్శించవలసిందిగా కోరుతున్నాను. అక్కడ జరపబోయే ‘తెలుగు ఫెస్టివల్’కు సహకరించవలసిందిగా కూడా కోరుతున్నా.
హైదరాబాద్కు ఉత్తర దక్షిణ దిక్కుల్లో యాదా ద్రి, ముచ్చింతల్ రెండు ఆలయాలున్నాయి. ఈ రెంటి మధ్య ఒక మ్యూజియం వంటి ఆధునిక కళాలయం నిర్మిస్తే తెలంగాణ ప్రజల సంస్కృతి చూడ్డానికి ప్రపంచ ప్రజలు ఈ పర్యాటక కేంద్రానికి క్యూ కడతారు. కేంద్రం ఇచ్చే గ్రాంటుకు అదనంగా ఆర్థిక సహకారం చేసి దేశంలోనే ఎన్నదగిన డిజిటల్ మ్యూజియానికి రూపకల్పన చేస్తే ఎంతో ఉపయోగకరం. మాలాంటి పరిశోధకులం స్వచ్ఛందంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం.కాళేశ్వరం, మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం, కరెంట్, తాగునీరు, సాగునీరు వంటి రంగాల్లో తెలంగాణ ప్రగతి సాధించింది. అది నావంటి వారి కంటికి వెలుగులై కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ ఆదివాసీ, జానపద కళలకు చిరునామాగా ఉన్న ‘ఆద్యకళ’కు మ్యూజియం ఏర్పాటు చేయగలిగితే భవిష్యత్తరానికి ఉపయోగం. ఆధునిక సాంకేతికతతో అంతరించిపోతున్న కళలను పరిరక్షించిన ఘనత కొత్త రాష్ర్టానికే చెందుతుంది.
(వ్యాసకర్త: ప్యారిస్ ‘ఇనాల్కో’లోని సౌత్ ఏషియా అండ్ హిమాలయ భాషా విభాగంలో తెలుగు బోధకులు. తెలుగు సాహిత్యం, భాష, కళలు, సంస్కృతులపై జరిగే పరిశోధనలకు గైడ్గా వ్యవహరిస్తున్నారు)
డాక్టర్ డేనియల్ నేజర్స్
0033(0)05 67 26 03