హైదరాబాద్ ప్రాంత 1600 ఏళ్ళ చరిత్రకు సాక్ష్యం చైతన్యపురి శాసనం
కృష్ణా-గోదావరి మధ్య విస్తరించిన రాజ్యం.. రాజాదరణ పొందిన వైదికం, బౌద్ధం
హైదరాబాద్లో మూసీ అనగానే ఒక ‘పెద్ద మురికి కాలువ’ అనే బాధాకరమైన భావన కలుక్కుమంటుంది. ఐదు దశాబ్దాల పాటు అసంబద్ధంగా సాగిన అభివృద్ధి తెలంగాణను కమ్మేసినట్టే, ‘మూసీనది’ని కూడా మురికి కాలువగా మార్చింది. కానీ ఇదే మూసీ 1960 దశకం ముందు వరకు ప్రవాహంగా నేటి హైదరాబాద్ చరిత్రను తన తీరం వెంబడి మోస్తూ ప్రవహించింది. ఆ చరిత్ర ప్రయాణంలో ఒక మజిలీ విష్ణుకుండి కాలానిది. హైదరాబాద్ చరిత్ర మధ్య యుగాల్లో మొదలుకాలేదు. లింగంపల్లి, మౌలాలి, హష్మత్పేట్ వంటి ప్రాంతాల్లో దొరికిన రాతి యుగపు ఆనవాళ్ల తర్వాత, చారిత్రక యుగానికి సంబంధించిన ఆధారాలు విష్ణుకుండి కాలానివి దొరికినయి. దిల్సుఖ్ నగర్ దగ్గర ఉన్న చైతన్యపురి ప్రాంతంలో ఒక గుట్ట మీద ఇప్పుడున్న కొసగుండ్ల లక్ష్మీనరసింహ స్వామి మందిరం దాదాపు 1600 ఏండ్ల వెనకటి చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది.
మూసీ నది ఒడ్డునే ఉన్న ఈ గుట్ట, దాని కింద చుట్టూ ఒక పెద్ద బౌద్ధవిహారం ఉండేదని 1982లో ఇక్కడ ఒక పెద్ద బండ మీద శాసనం దొరికే వరకు తెలియదు. ఇక్కడి గుట్ట మీద నరసింహ స్వామి ఆలయాన్ని నెలకొల్పినప్పుడు తెలుగు పండితులు కొమాండూరు శేషాచార్యులకు శిలా శాసనం కన్పించడం, దాన్ని ఆర్కియాలజీ శాఖ ఎపిగ్రాఫిస్టు పీవీ పరబ్రహ్మ శాస్త్రికి అందివ్వడంతో కొత్త చరిత్ర ఆవిష్కృతమైనది. ప్రాకృత భాష, ‘బ్రాహ్మీ లిపి’లో ఉన్న ఈ శాసనం ఇక్కడ బౌద్ధ మహా విహారం ఉన్నదని బయట పెట్టింది.
ఐదవ శతాబ్దం మధ్యభాగంలో (క్రీ.శ. 440 ప్రాంతంలో) ఇక్కడ విష్ణుకుండి రాజు గోవిందవర్మ నిర్మించిన గోవిందరాజ విహారంలో భిక్షువులకు అవసరమైన గంధం, చీవరాలను (బౌద్ధ భిక్షువుల బట్టలు) అందించే వారి కోసం రాతితో కట్టిన ఆవాసం విషయమై దానం చేస్తున్నట్టు ఈ ఆరు లైన్ల శాసనం చెప్తున్నది. ఇక్కడే ఇంకో పెద్ద రాతి మీద దాదాపు 100 అడుగుల ఎత్తున ఉన్న రెండు లైన్ల శాసనంలో ‘గోవిందరాజ మహా విహార’ అని ఉన్నట్టు 1986లో ఆర్కియాలజీ శాఖ రికార్డు చేసింది (ఇప్పటికీ చాలా మంది పరిశోధకులు ఇది ఇంకా రికార్డు కాలేదని రాస్తున్నారు).
ఈ చైతన్యపురి శాసనానికి ఎన్నో విశిష్టతలున్నాయి. మొదటిది, హైదరాబాద్ నగర 1600 ఏండ్ల ప్రాచీన చరిత్రను బయటపెట్టింది. ప్రస్తుతం కొసగుండ్ల నరసింహస్వామి ఆలయం ఉన్న గుట్ట కింద ప్రాంతమంతా ‘ఫణిగిరి కాలనీ’ పేరిట ఓ కాలనీ వెలిసింది. 1980 దశకం నుంచి మొన్న మొన్నటి వరకు ఇండ్ల కోసం పునాదులు తవ్వితే పెద్ద ఇటుకలు, పాత కుండ పెంకులు దొరికేవి. శాసనం దొరికినప్పుడే ఆర్కియాలజీ శాఖ ఇక్కడ తవ్వకాలు చేసి ఉంటే హైదరాబాద్ నగరంలో విష్ణుకుండి కాలం నాటి ప్రాచీన బౌద్ధ విహారం బయటపడి, నేడు విదేశీ బౌద్ధ పర్యాటకులను ఆకర్షించేది. ఈ విస్మృతి ఒక గొప్ప చారిత్రక స్థలాన్ని శాశ్వతంగా మాయం చేసిందని బాధ పడటం తప్ప ఏమీ చేయలేం.
1983లో బిర్లా ఆర్కియలాజికల్ ఇన్స్టిట్యూట్ ఇదే ప్రాంతంలో మధ్య రాతి యుగానికి చెందిన సూక్ష్మ రాతి పనిముట్లను (మైక్రోలిత్స్) సేకరించింది. రెండేండ్ల క్రితం ఈ వ్యాసకర్త, బుద్ధవనం ఉద్యోగి శ్యామ్ సుందర్తో కలిసి ఇదే గుట్ట మీద రాతిపై కొత్త రాతి యుగపు పనిముట్లు చెక్కుకున్న ఆనవాళ్లను గుర్తించడం జరిగింది. అంటే ఈ చైతన్యపురి ప్రాంతం కొత్త రాతి యుగం నుంచి విష్ణుకుండిన కాలం వరకు మూసీ ఒడ్డున మానవ సంచారానికి నిలయంగా ఉండేదని తెలుస్తున్నది.
ఇక రెండవ విశిష్టత- బౌద్ధంలో మహాయాన ప్రభావం పెరిగినప్పటికీ ఇక్కడ పిండపాతక శాఖకు చెందిన థేరవాద బౌద్ధ భిక్షువులున్నారని శాసనం చెప్పింది. ఇక మూడోది- ఈ గోవిందరాజ విహారం, పుఢగిరి మహావిహారంలో భాగంగా తెలుస్తున్నది. ఈ పుఢగిరి ఎక్కడ ఉంది? ఈ శాసనాన్ని మొదటిసారి ఆవిష్కరించిన పరబ్రహ్మ శాస్త్రి భారతి పత్రికలో రాసిన వ్యాసంలో సూర్యాపేట జిల్లాలో విరాజిల్లిన ఫణిగిరి అయ్యే అవకాశం ఉందనే భావాన్ని వ్యక్తపరిచారు. అదే వ్యాసంలో బిహార్లోని పాట్నా, రాజగృహ దగ్గర ఉన్న బౌద్ధ విహారమేమో అని వ్యాఖ్యానించారు. ఇంకొందరు ఈ పుఢగిరిని కడపలోని పుష్పగిరి లేదా ఒడిశాలోని పుబ్బగిరి, ఉండవల్లి – పెనుమాక కొండగా భావించారు. ఈ శాసనం బయటపడి 40 ఏండ్లు అయింది. ఆ తరువాత ఫణిగిరిలో జరిగిన తవ్వకాలు, తెలంగాణ అంతటా బౌద్ధ ఆనవాళ్ళు ఎన్నో బయటపడిన నేపథ్యంలో పుఢగిరి ఇక్కడున్న ఫణిగిరి లేదా తెలంగాణలోని ఇంకో విహారం ఎందుకు కాకూడదని ఆలోచించాలి.
విష్ణుకుండి కాలంలో ఏలేశ్వరం: నాగార్జునసాగర్ నీట మునిగిన ఏలేశ్వరం రాతియుగం, శాతవాహన, ఇక్ష్వాకు కాలాల తర్వాత విష్ణుకుండి రాజ్య భాగమైంది. అమ్రాబాద్ దగ్గర మొదలై కృష్ణ- మూసీ పరీవాహక ప్రాంతం నుంచి మళ్ళీ నల్గొండలోని ఏలేశ్వరంలో కృష్ణ తీరం వరకు నదీ ప్రవాహం వెంటే విష్ణుకుండి రాజ్యం విస్తరించింది అనడానికి ఇదే ప్రాతిపదిక. 1960-62 మధ్య జరిగిన ఏలేశ్వరం తవ్వకాల్లో దొరికిన ఆధారాలు ఇక్కడ ఇక్ష్వాకుల తర్వాత, కొంతకాలం తొలి పల్లవులు, ఆ తర్వాత విష్ణుకుండి వంశం ఏలిందనే ఆధారాలు దొరికినయి. ఒక చిన్న కుండలో దొరికిన 49 విష్ణుకుండి నాణేలు ఇందుకు ముఖ్య ఆధారం.
ఇక్కడ దొరికిన అపురూపమైన ఖండిత విష్ణు శిల్పం పల్లవ-విష్ణుకుండి కాలానిదని (క్రీ.శ.4-5) ఏలేశ్వరంపై వచ్చిన మోనోగ్రాఫ్లో మొహమ్మెద్ అబ్దుల్ వలీ ఖాన్ రాసారు. ఈ శిల్పం తల, కాళ్ళు లేకుండా దొరకడం బాధాకరమే అయినా ఒక చేతిలో దండం, ఇంకో చేత శంఖం ఉండటంతో విష్ణు శిల్పంగా గుర్తించారు. అంటే ఏలేశ్వరం విష్ణుకుండి కాలంలో కూడా తొలి నాళ్ళ విష్ణు రూపాన్ని తన గర్భంలో దాచుకుని మనకు అందించింది.
ఇక్కడ విష్ణుకుండి కాలం నాటి పూసలు, టెర్రకోట బొమ్మలు, సున్నం బొమ్మలు, గాజులు, ఇనుప మేకులు, రాతి మట్టి, రాతి పాత్రలు దొరికాయి. ఇంకా ఎన్నో స్థలాల్లో శాతవాహన-ఇక్ష్వాకు కాలాల కొనసాగింపును సూచించే విష్ణుకుండి కాలం ఆధారాలు లభ్యమయ్యాయి. సూర్యాపేట జిల్లాలోని అపురూపమైన పురాతత్వ స్థలం ఫణిగిరి. ఇది శాతవాహనుల నుంచి విష్ణుకుండి వరకు నాలుగైదు శతాబ్దాలు విలసిల్లింది అని చెప్పడానికి ఇక్కడ తవ్వకాల్లో దొరికిన పురావస్తువులు, నాణేలే సాక్ష్యం. తుమ్మలగూడెం పక్కనే ఉన్న నాగారంలో 1940 లోనే ఖ్వాజా మొహమ్మద్ అహ్మద్ పెద్ద ఇటుకల్ని గుర్తించారు. ఖమ్మం జిల్లాలోని నేలకొండ పల్లిలో కూడా శాతవాహన, ఇక్ష్వాకుల కొనసాగింపుగా విష్ణుకుండి నాణేల ఆధారాలు దొరికినయి. సంగారెడ్డి జిల్లాలోని కందిలో జరిపిన చిన్నస్థాయి తవ్వకాల్లో బయటపడ్డ ఒక ఆలయం వంటి నిర్మాణం శాతవాహనుల చివరి కాలం నుంచి విష్ణుకుండి కాలం మధ్యలో కట్టినదని భావిస్తున్నారు. వరంగల్లోని గీసుకొండ, పెద్దపల్లిలోని తేలుకుంటలో దొరికిన నాణేలు కూడా విష్ణుకుండి ప్రాబల్య విస్తరణను తెలుపుతున్నాయి.
విష్ణుకుండి రాజ్య విస్తరణ రెండు విధాలుగా జరిగింది. మొదట కృష్ణ -గోదావరి నదుల మధ్య ప్రాంతాల్ని గెలుచుకుంటూ సాగింది. విస్తరణకు రెండో కారణం వాకాటకులలోని ఒక శాఖతో వివాహ సంబంధం. అందుకే తొలినాళ్లలో అమ్రాబాద్ నుంచి మొదలై స్వతంత్ర రాజ్యంగా ఏర్పడే క్రమంలో ఇంద్రపురం (తుమ్మలగూడెం), కీసర రాజధానులుగా ఉండి, విస్తరించే క్రమంలో ఆంధ్రలోని ధాన్యకటకం లేదా ధరణికోట (నేటి అమరావతి), లెందులూరు (పశ్చిమ గోదావరిలోని దెందులూరు), ఇంద్ర కీలాద్రి రాజధానులుగా పాలించారని చరిత్రకారుల భావన. అయితే రాజధానులుగా భావిస్తున్న కొన్ని స్థలాలు కేవలం స్కంధావారాలు (సైనిక శిబిరాలు) కావచ్చు అనే వాదన కూడా ఉన్నది. అదే విధంగా వీరి పాలనా కాలం గురించి, రాజుల సంఖ్య గురించి కూడా భిన్న వాదనలున్నాయి. మరిన్ని శాసనాలు, పురావస్తు ఆధారాలు దొరికితే విష్ణుకుండి చరిత్రలోని భిన్న వాదనలకు సమాధానం దొరుకుతుంది.
చైతన్యపురి శాసనానికి ఎన్నో విశిష్టతలున్నాయి. మొదటిది, హైదరాబాద్ నగర 1600 ఏండ్ల ప్రాచీన చరిత్రను బయటపెట్టింది. ప్రస్తుతం కొసగుండ్ల నరసింహస్వామి ఆలయం ఉన్న గుట్ట కింద ప్రాంతమంతా ‘ఫణిగిరి కాలనీ’ పేరిట ఓ కాలనీ వెలిసింది.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000