పరమాత్మ వల్ల వేదం ఆవిర్భవించింది. వేదం ఆధారంగా కర్తవ్య కర్మలు జనించాయి. కర్మ వల్ల యజ్ఞం పుట్టింది. యజ్ఞం వల్ల వర్షాలు కురిస్తే, ఆ వర్షాల ద్వారా పంటలు పండి అన్నం లభిస్తుంది. అన్నం మూలంగానే ప్రాణులు శరీరాలను ధరిస్తున్నాయి. అన్నాన్ని సర్వశ్రేష్ఠంగా భావించే వారికి అన్నికాలాల్లో అది పుష్కలంగా లభిస్తుంది. ‘తే అన్నమాప్నువంతి యే అన్నం బ్రహ్మోపాసతే’ అని తైత్తిరీయ ఉపనిషత్తు తెలియజేస్తుంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించడానికి ఇదే కారణం.
అన్నం వల్లనే మన శరీరాలు ఏర్పడుతున్నాయి. అంతేకాదు, అన్నం ఈ శరీరాలకు పోషణ. పంచభూతాలతో మన శరీరం ఏర్పడినప్పటికీ, వాటిలో భూమికి సంబంధించిన శరీర భాగమే ఎక్కువ. మనం తినే ఆహారమంతా మట్టి నుంచే లభిస్తుంది. ఒకవిధంగా మన శరీరస్థితికి అన్నమే ప్రధానం. భగవంతుని సృష్టిలో ఉన్న అన్నభండారం ఎంతో గొప్పది. అన్నాన్ని ఉపయోగించుకొని మనం ఆకలిబాధ నుంచి తప్పించుకుంటాం కాబట్టి అన్నానికి ‘ఔషధం’ అన్న పేరు వచ్చింది.
ప్రాణికోటిలో మానవునిది శ్రేష్ఠమైన జన్మ. అతని శరీరం పాంచభౌతికమైంది. అయినప్పటికీ, దానిలో పంచకోశాలున్నాయి. వీటినే పంచ శరీరాలుగా భావిస్తారు. వీటిలో మొదటిది అన్నమయ శరీరం. ఇది మనందరికీ కనిపిస్తూనే ఉంటుంది. మిగిలిన నాలుగు ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ శరీరాలు. స్థూలమైన అన్నమయ శరీరంలో సూక్ష్మమైన ప్రాణ శరీరం ఉంటుంది. శరీరంలో ఉన్న వాయువుకే ప్రాణమని పేరు. ప్రాణ, ఉప ప్రాణాలతో కూడుకున్నదే ప్రాణమయ శరీరం. ప్రాణం, అపానం, ఉదానం, సమానం, వ్యానం అనేవి పంచప్రాణాలు. నాగం, కూర్మం, కృకలం, దేవదత్తం, ధనుంజయ అనేవి ఉప ప్రాణాలు. మొత్తం పది ప్రాణాలు. ఈ ప్రాణమయ శరీరాన్ని చక్కగా కాపాడుకున్న మానవుడు చాలాకాలం జీవిస్తాడు. పూర్ణాయువు పొందుతాడు. ప్రాణవృత్తులు బాగా ఉన్నంత కాలం ఇంద్రియాలు చక్కగా పనిచేస్తాయి.
మనం ఆకలిగొని అన్నం తింటున్నామనుకుంటాం. కానీ, ఆకలిగొనేది ప్రాణమే! అదే అన్నం తిని ఇంద్రియాలకు బలాన్నిస్తుంది. అన్నమయ శరీరం అవయవాల రూపంలో కనిపిస్తుంది. కానీ, ప్రాణమయ శరీరం కండ్లకు కనిపించదు. ఇది అన్నమయ శరీరంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. పంచ ప్రాణాలలో.. ప్రాణం గుండెలో ఉంటుంది. అపానం మలమూత్రేంద్రియాలలో ఉంటుంది. ఉదానం కంఠంలో ఉంటుంది. సమానం నాభిలో ఉంటుంది. వ్యానం శరీరమంతటా ఉంటుంది. పంచప్రాణాలే శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఉప ప్రాణాలు వాటికి తోడుగా ఉంటాయి.
అన్నమయ శరీరం కన్నా ప్రాణమయ శరీరం సూక్ష్మమైనట్లే, ప్రాణమయ శరీరం కన్నా మనోమయ శరీరం సూక్ష్మమైంది. దీనికే అంతఃకరణం అని పేరు. దీని ద్వారానే సంకల్ప వికల్పాలు కొనసాగుతాయి. సాత్వికాహారం ద్వారా అన్నమయ శరీరాన్ని బలోపేతం చేసినట్లే, యోగాభ్యాసం ద్వారా ప్రాణమయ శరీరాన్ని బలోపేతం చేసుకోవాలి. అంతేకాదు, మనోమయ శరీరాన్ని కూడా అన్ని మాలిన్యాల నుంచి దూరంగా ఉంచేది యోగమే! చిత్తవృత్తులను నిరోధించకుండా మనసులో పరమాత్మ ఆనందస్వరూపం తెలుసుకునే అవకాశం ఉండదు.
మనోమయ శరీరం కన్నా సూక్ష్మమైనది విజ్ఞానమయ శరీరం. దీనిలోనే జీవుడుంటాడు. జీవుడు చైతన్య స్వరూపుడు. చైతన్యం అంటే జ్ఞానం. శరీరంలో ఉండి జాగ్రత్, స్వప్న, నిద్రావస్థలను పొందేవాడు జీవుడే. రాగద్వేషాలకు లోనయ్యేవాడూ జీవుడే. మనసుకు పరమాత్మ విషయం కాడని ఉపనిషత్తులు చెప్తాయి. కాబట్టి, జీవుడే జ్ఞాన, విజ్ఞానాలను అధిగమించి ఆనంద స్వరూపుడైన పరమాత్మను చేరుకోవాలి. అందుకే విజ్ఞానమయ శరీరం కంటే ఆనందమయ శరీరం సూక్ష్మమైనదిగా చెప్తారు. ఆనందమయ శరీరం పరమాత్మదే. జీవుడు పంచకోశాల గురించి తెలుసుకొని, చివరిదైన ఆనందమయ కోశంలో ప్రవేశించినప్పుడే జన్మకు సార్థకత లభిస్తుంది.
ఆచార్య మసన చెన్నప్ప
98856 54381