ఎండ్లూరి గొంతు పలు నెత్తుటి ప్రశ్నలను సంధించింది. ఒక బాధిత సమూహం గురించి అర్థవంతమైన, ఆర్ద్ర ప్రశ్నలను తన కవిత్వం ద్వారా అడిగాడు.
కుల వ్యవస్థకు, దాని క్రౌర్యానికి బలైపోతున్న పరిస్థితిని చూశాడు. ఆ వేదనా భరిత సంఘర్షణలోంచే గొప్ప కవిత్వాన్ని రాశాడు.
‘కవిత్వం నిప్పు; నిజమే మాట్లాడుతుంది’ అన్నాడు ఎండ్లూరి సుధాకర్. తనను నిలువున దహించివేసిన వాస్తవాలను, స్వీయ అనుభవాలను, తన సమూహం వేల ఏండ్లుగా అనుభవిస్తూ వచ్చిన సమస్త వేదనలను తీవ్ర స్వరంతోనూ, దీర్ఘశ్రుతిలోనూ పాడాడు. కవిత్వం అగ్ని సదృశం అతనికి. మరొక చోట కూడా ఇదేమాట మరోవిధంగా అన్నాడు ‘నిప్పుల మీద నిలబడి నిజాన్ని నినదిస్తున్నాను’. ఎందుకు సుధాకర్ ఇలా అన్నాడు, రాశాడు?
సుధాకర్ తెలుగు కవిత్వంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలోనే ఒక కొత్తతరం కొత్త సంవేదనలో, దృక్పథి అభివ్యక్తులతో తనని తాను ప్రకటించుకుంటున్నది. అప్పటిదాకా సాగివచ్చిన కవి త్వ వాదనలు, ధోరణులు సరికొత్త సామాజిక, రాజకీయ సంవాదంలోకి పోవటానికి తటపటాయింపు ఉన్న కాలం కూడా అదే. 1960లలో తలెత్తిన నూతన సామాజిక ఉద్యమాలలోకి గుర్తింపు రాజకీయ ఉద్యమ చైతన్యం అనేది కూడా చొచ్చుకొచ్చింది. అన్నిటికీ విముక్తిని అన్నిటి నుంచీ విముక్తిని అందుకోలేక పోయిన బాధిత అస్తిత్వాలు తమ స్వరాలను వెతుక్కోక తప్పలేదు. ఆ వెల్లువలోంచి వచ్చిందే ఎండ్లూరి సుధాకర్ గొంతు.
ఎండ్లూరి గొంతు పలు నెత్తుటి ప్రశ్నలను సంధించింది. ఒక బాధిత సమూహం గురించి అర్థవంతమైన, ఆర్ద్ర ప్రశ్నలను తన కవిత్వం ద్వారా అడిగా డు. కుల వ్యవస్థకు, దాని క్రౌర్యానికి బలైపోతున్న పరిస్థితిని చూశాడు. ఎన్నో సంఘటనలు అవి సామాజికమైనవైనా, సాంస్కృతికమైనవే అయినా.. రాజకీయ ప్రేరితమైనవైనా ఎక్కడా న్యాయం దొరకడం లేదని నిశ్చయమయ్యాక..
‘మాకిప్పుడు కావలసింది నెత్తుటి రొఖ్కం కదు మాకేం కావాలో కోరుకునే నిర్భయపు గొంతుక కొత్త రాజ్యాంగం కొత్తదేశం కొత్తభూమి కొత్త ఆకాశం..’ అని ఆత్మగౌరవంతో ప్రకటించాడు. ‘రాతియుగంలో జీవించలేను’ అని నిష్కర్షగానే చెప్పాడు.
ఆ క్రమంలో ఆత్మగౌరవ పోరాటాలు, అంబేద్కర్, పూలే ఆలోచనాధార, కాన్షీరాం రాజకీయ అవగాహన, ఆచరణలు కొత్త అవగాహననే కాకుం డా, దృక్పథ నైశిత్యాన్ని కూడా పెంచాయి. సామాజిక, సాంస్కృతిక అణచివేతల నుంచి రాజ్యాధికారం దిశగా అడుగులు అనే ఊహ అనేకమంది దళిత బహుజన కవిమిత్రులకు నైతిక బలాన్ని ఇచ్చింది. తెలుగు ఆధునిక కవిత్వంలో ముఖ్యంగా దళిత కవిత్వానికి అంతకుముందునుంచి సాగివస్తున్న సామాజిక, రాజకీయ ఉద్యమాల దన్ను ఉంది. అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సాగిన సామాజిక, రాజకీయ చైతన్య ప్రభావం కూడా తక్కువదేమీ కాదు.
ఎండ్లూరి సుధాకర్ ‘వర్తమానం’ 1992లో వెలువడింది. ‘నాకు ప్రతిభ లేదనే కదా అభియోగం/ నా భూమిని దొంగిలించాక నా కళల్ని తొక్కిపట్టాక/ నా చుట్టూ నిషిద్ధ కుడ్యాలు నిలబెట్టాక/ ఇంక నాకు ప్రతిభెక్కడిది?’ అని ప్రశ్నించిన సుధాకర్.. ‘ మట్టి నా ప్రతిభ’ అని ప్రకటించాడు. కుల వ్యవస్థ తనకు చేసిన గాయాలను, అవమానాలను వివరించాడు. అమానుష చర్యలను నిరసించాడు. అంతేకాదు.. ‘ఇవాళ నాది అగ్నిముఖం/ నా చేతులు వజ్రాయుధాలు/ నేనిప్పుడు నడిచే ఖడ్గాన్ని/ నన్నెవరూ తాకలేరు/ నేను నిద్రలేచిన పులిని..’ అన్నాడు. గతం తనమీద జరిపిన జులుంను ఖం డించాడు. ‘నా తరతరాల ఆక్రోశాల కన్నీటి కైఫీయతుల్ని/ నా జాతి వేలిముద్రల దరిద్రపు చీకటి చరిత్రల్ని /నడిరోడ్డు మీద చించిపోగులు పెడుతున్నా ను..’అని చెప్పి.. ‘భవిష్యత్తు గుండెల్లో నిర్భయంగా సంతకం చేస్తున్నాను’ అనే ధీమాను ప్రకటించాడు.
‘వర్తమానం’లోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాడు. తొలి సంపుటిలోనే ‘సహచరి’, ‘గూర్కా’, ‘మైసమ్మ మరణం’, ‘గ్రీష్మగోదావరి’, ‘రక్త నగరం’, ‘ఇందిరాపార్కు’ లాంటి కవితలు కవిగా సుధాకర్ పటుత్వాన్ని చాటి చెప్పాయి. వస్తు స్వీకరణలో, అభివ్యక్తిలో అటు సంప్రదాయ కవి సమయాలను కొనసాగిస్తూనే కొత్త భావనలను, ఊహలను హృద్యంగా చేసి పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.
సుధాకర్ ఎంతో విస్తృతి, లోతు ఉన్న అధ్యయన శీలి. ఉర్దూ, పారశీక ప్రక్రియల గురించి సాంప్రదాయ పరిచయ అవగాహనలున్నాయి. సాహిత్యాన్ని విలువలతో కాపాడుతూనే, సాహిత్యం ద్వారా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులను ఎట్లా తీసుకురాగలమో సుధాకర్కి బాగా తెలుసు.
తాను కావ్యత్రయం పేరిట ‘కొత్త గబ్బిలం’,‘వర్గీకరణం’, ‘గోసంగి’ లాంటి దీర్ఘ కవితలను ప్రచురించాడు. ‘కొత్తగబ్బిలం’జాషువా గబ్బిలం కావ్యాన్ని స్థూలంగా దృష్టిలో ఉంచుకొని ఎన్నో వర్తమాన విషయాలను కులపరమైన సమస్యలను, ప్రాంతీయ స్వభావాలను ఆవిష్కరించింది.
‘గబ్బిలం రాజ్యం’ రావాలని బలంగా కోరుకున్నాడు. ‘నా స్వప్నదేశ బహుజన వసంతానివి’ అని గబ్బిలం గురించి సుధాకర్ చెప్పిన మాట. తన కలల రాజ్యానికి ఒక కొత్త సూత్రం కనుక్కురమ్మ ని గబ్బిలంతో అంటాడు.
‘మతాతీత కులాతీత/ సమతాదేశాన్ని ప్రతిష్ఠించాలి/ మనిషి మనిషిగా బతికే/ సాంఘిక సమానత్వ / గౌరవాన్ని ప్రతిష్ఠించాలి/ఇప్పుడు అన్ని కులాలూ/ ఏకోన్ముఖంగా కులీనం కావాలి/ ఇక అన్ని వర్ణాలూ/ ఆర్థికంగా విలీనం కావాలి/ ఇది నా సందేశం గబ్బిలమా/ ఇది నా ఉద్దేశం గబ్బిలమా..’ అంటూ తన ఆకాంక్షను వెల్లడించాడు.
‘వర్గీకరణం’ బహుజన ఉద్యమ రాజకీయాలను సంబోధించింది. ముఖ్యంగా వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వారి, తీరును ఖండిస్తూనే విన్నవించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ‘సాధించుకున్న దాన్ని/ సగం సగం పంచుకోవడమే వర్గీకరణ’ అని చెపుతాడు. అలాగే.. ‘ఈ వర్ణ వ్యవస్థలో/ ఎన్నాళ్లకో వచ్చిన సువర్ణావకాశం/ ఎవడి బొచ్చె వాడికే/ ఎవరి ముద్ద వాళ్లకే/ ఏబీసీడీ లంటే..’ ఇదే అన్నాడు.
‘గోసంగి’ శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాల్యదలోని ఒక కథ ఆధారంగా కుల దృష్టితో దళితుల ఆవేదనను ఆవిష్కరించింది.
‘నాది హిందు నాగరికత కాదు/ నా చిందు నాగరి కత’ అని తన వైఖరిని విస్పష్టంగా చెపుతాడు సుధాకర్. మమత, సమత, మానవత ఈ మూడు భావనలు ఎండ్లూరి సుధాకర్ వ్యక్తిత్వంలో అంతర్భాగాలు. అవిభాజ్య ధర్మాలు. అవే ఆయనకు, ఆయన కవిత్వానికి ఆభరణాలు.
తన వాళ్లు వేలాది ఏండ్లుగా వెలివాడలలో జీవించారు. అంటరాని తనం, అవమానంతో పాటుగా ఆకలి కూడా వారిని బాధించింది. ఈ ఎరుకతో ఆయన అక్షరానికి పదును పెట్టారు. ‘మల్లె మొగ్గల గొడుగు-మాదిక కతలు’ పేరిట ఆయన రాసిన కతలు కవిత్వం లాగే ఎంతో విలువైనవి. ‘ మా బతుకులూ మా బాధలూ, మా కన్నీళ్లూ చెప్పటానికే నేనీ ప్రయత్నం చేశాను. నేనెలా చెప్పేను అనే కంటే ఏం చెప్పేనూ అనేదే ముఖ్యం. నాకు వస్తువు ప్రధానం’ అనటంలో దృక్పథం సాహిత్యానికి ఎంత ముఖ్యమైందో సూచించాడు. మాదిగ సంస్కృతి ఔన్నత్యాన్ని ఆయన సాహిత్యం గుండెవిప్పి చెప్పిం ది. డప్పుకొట్టి మరీ ప్రకటించింది.
‘కులగ్రస్థ’ సామాజిక వ్యవస్థలో ఎటువంటి అనుభవాలు ఎదుర్కోవలసి వచ్చిందో, ఆ అనుభవాల సారాంశం ఆగ్రహ ప్రకటనే ఎండ్లూరి సుధాకర్ కవిత్వం, ‘కులం’ అన్నింటినీ నియంత్రించేది, ఆధిపత్యం వహించేది. అది పెట్టే నియంత్రణల నుంచి వైదొలగటం, ఆధిపత్యాల నుంచి బయటపడటం అనేవి అంతసామాన్యంగా వీలయ్యేవి కావు. కాబట్టే కవి.. ‘పూలతోటలకు ప్రారంభోత్సవం చేసి పరిమళాలను బహిష్కరిస్తారు’ అనీ, “జాతి గొంతు నులుముతూనే జాతీయగీతాన్ని ప్రసారం చేస్తారు” అని వైరుధ్యాన్ని, అసంబంధ్ధ స్థితి గురించి వ్యాఖ్యానించాడు.
‘దొంగ నాన్న’ ఊరెళ్లినప్పుడు ఆరెండు కళ్లూ సముద్రాలవుతాయి అని రాశాడు కదా! ఇప్పుడు ఎన్ని కళ్లు సముద్రాలయ్యాయో! సామాజిక, రాజకీయ దృక్పథ తీవ్రత ఎంతగా ఉంటుందో తన కవిత్వంలో తాత్విక స్పర్శ కూడా అధికంగానే ఉంటుం ది. ‘ఇక్కడ బతకడానికే మనం మొలిచాం/ బతుకు యుద్ధంలో బరి తెగించి నిలిచాం..’ అన్నాడు. దేనికీ భయపడలేదు. దేనికీ లొంగలేదు. వెనుకడుగు వేయ లేదు. చివరికి మృత్యువుకు కూడా..
‘చావంటే మనుషులకెంత భయమో/ పూలపాన్పు కౌగిట్లో చరమ స్వప్నం కదా మరణం/ అది తొలిసారి అనుభవించే ఆఖరి చుంబనం’ అంటూ.. ‘అక్షర గర్భంలో పునరపి జననం అయ్యేంత వరకూ నన్ను సాన పెట్టండి’ అన్నాడు. ఆయనకు అక్షర నివాళి.