ఎన్నికల్లో గాలివాటం విజయాలు అప్పుడప్పుడు కాకలుతీరిన రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యచకితులను చేస్తాయి. కానీ అవి స్థిరమైనవీ, నిరంతరమైనవీ కాజాలవు. వివిధ సందర్భాల్లో అక్కడక్కడ అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న పార్టీలు, ప్రతినిధులు ఆ తర్వాత సోదిలోకి లేకుండా పోయిన ఉదంతాలు ఎన్నికల చరిత్రలో కోకొల్లలు. ఈ చారిత్రక సత్యం బీజేపీకి అనుభవైక వేద్యమే. ఓ రెండు అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకొని అదే అద్భుత విజయంగా అభివర్ణిస్తూ, అధికారంలోకి వచ్చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న ఆ పార్టీ అగ్రనేతల గడుసుదనం, వారి పర్యటనలు, పటాటోపం చూస్తుంటే ఒకింత ముచ్చటేస్తున్నది.
1951 నుంచి 1977 వరకు భారతీయ జనసంఘ్గా, 1977-80 మధ్య కాలంలో జనతా పార్టీలో విలీనంగా, 1980 నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)గా రూపాంతరం చెందిన ఈ పార్టీ గత 70 ఏండ్లలో ఏ ఎన్నికల్లోనూ తెలంగాణలో రెండంకెల విజయాన్ని నమోదు చేయలేదు. తొలి పాతికేళ్లలో కేవలం ఒక్క పరకాలలోనే 1967 ఎన్నికల్లో విజయం సాధించింది. ఒక జాతీయ పార్టీ స్థాయిలో బీజేపీ సమైక్య రాష్ట్రంలో, తెలంగాణలో అధికార పార్టీలతో ‘ఢీ అంటే ఢీ’ అనే బలాన్ని ఏనాడూ సంతరించుకోలేదు.
గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు, దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలు గ్రేటర్ ఎన్నికల్లో 46 డివిజన్లు సాధించిన బీజేపీ అప్పుడే 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరుతూ ముహూర్తాలు పెట్టేసుకుంటున్నది. పందాలు కడుతున్నది. ఈ మాత్రానికే ఇంత వీరంగమా? ఈ మోస్తరు విజయాలు బీజేపీ గతంలో కూడా సాధించింది. కానీ ఏనాడూ రాష్ట్రంలో అధికారం దరిదాపుల్లోకి రాలేదు. 1999 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్, మహబూబ్నగర్లలో గెలిచింది. ఆ తర్వాత మెదక్, మహబూబ్నగర్లలో అంతర్థానమైంది. కరీంనగర్, సికింద్రాబాద్లలో సైతం 2004, 2009 ఎన్నికల్లో పరాజయం పాలైంది.
20 ఏండ్ల తర్వాత గాని మొన్నటి ఎన్నికల్లో కరీంనగర్లో కాలుమోపింది. 15 ఏండ్ల విరామానంతరం సికింద్రాబాద్లో 2014, 19 ఎన్నికల్లో గెలిచింది. 1984లో హన్మకొండ లోక్సభ స్థానంలో ఏకంగా పీవీనే ఓడించిన బీజేపీ ఆ తర్వాత కనీసం సమీప ప్రత్యర్థి స్థాయికైనా ఎదగలేదు. మొత్తానికి ఒక సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో వరుసగా కాకపోయినా గణనీయంగా విజయం సాధిస్తూ వస్తున్నది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాల పరిధిలోని స్థానికసంస్థల ఎన్నికల్లో బీజేపీ దారుణంగా భంగపడింది. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో 40 గ్రేటర్ డివిజన్లకు బీజేపీ గెలిచింది 13 మాత్రమే. విజయాలు స్థిరమైనవైతే వెనువెంటనే జరిగిన ఎన్నికల్లో అదే సరళి ప్రతిఫలించాలి కదా? గాలివాటం విజయాల గమనం అలాగే ఉంటుంది.
ఇక శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ అంబర్పేట్ (హిమాయత్నగర్) గోషామహల్ (మహరాజ్గంజ్) స్థానాల్లోనే ఒకటీ అరా పరాజయాలున్నా స్థిరంగా కొనసాగుతున్నది. 1999 వరకు మెట్పల్లి (కోరుట్ల), మలక్పేట్, అలంపూర్, కారవాన్, పరకాలలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన ఈ పార్టీ 20 ఏండ్లుగా ఉనికిలో లేదు. పెద్దపల్లి, సంగారెడ్డి, రామాయంపేట (మెదక్), హన్మకొండ (వరంగల్ పశ్చిమ), శాయంపేట (భూపాలపల్లి)ల్లో ఒక్కోసారి, వర్థన్నపేట, పరకాల, నిజామాబాద్లలో రెండేసిమార్లు గెలిచిన బీజేపీ ఆ నియోజకవర్గాల్లో చతికిలపడి చాలాకాలమైంది.
ఆరు దశాబ్దాల సమై క్య రాష్ట్ర చరిత్రలో, ఏడేండ్ల స్వరాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఏ సాధారణ ఎన్నికల్లోనైనా బీజేపీ అత్యధికంగా గెలిచిన స్థానాలు 8 (1985, 1999) మాత్ర మే. అదీ టీడీపీ పొత్తుతో. బీజేపీ ఆవిర్భవించిన 40 ఏండ్లలో 9 సార్లు శాసనసభ సాధారణ ఎన్నికలు జరిగితే తెలంగాణలో సాధించిన సీట్లు వరుసగా 3, 8, 5, 3, 8, 1, 2, 5, 1 కాగా 10 సార్లు జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికల్లో వరుసగా 1, 0, 1, 0, 2, 4, 0, 0, 1, 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక చరిత్రలో ఒక్క జిల్లా పరిషత్ను కైవసం చేసుకోలేదు. బల్దియాపై కాషాయం జెండా ఏనాడూ ఎగరలేదు. శాసనమండలిలో ఉన్న ఒక్క సీటు ఊడిపోయింది.
ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడప్పుడూ అధికార పార్టీకి ఎంతో కొంత వ్యతిరేకంగా ఫలితాలు రావడం కొత్త కాదు. దీనికి బీజేపీ అతీతమూ కాదు. మోదీ తొలిసారి వారణాసి లోక్సభకు ఎన్నికై ప్రధానిగా బాధ్యతలు వహించిన కొంత కాలానికే జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో ఆ జిల్లాలో బీజేపీ 58 సీట్లకుగాను 8 సీట్లే గెలిచింది. గుజరాత్లో సైతం గత స్థానిక ఎన్నికల్లో బాగా వెనుకబడిపోయింది. ఒకదశలో అహ్మదాబాద్ కార్పొరేషన్నూ కోల్పోయింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు లోక్సభకు ఎన్నికై తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాతి ఉపఎన్నికల్లో బీజేపీ 7 సీట్లను కోల్పోయింది. వీటిలో ఒకటి మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ పరిధిలోని ఒక సెగ్మెంట్ (రొహనియా) కావడం విశేషం.
వాజపేయి, మోదీ గాలుల్లో సైతం తెలంగాణలో సింగిల్ డిజిట్కే పరిమితమైన బీజేపీ ఎకాఎకిన 2023లో అధికారంలోకి రావడం ఎట్లా సాధ్యం? గెలిపించగలిగే స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలు పట్టుమని పదైనా ఆ పార్టీ చూపించగలదా? పొద్దస్తమానం దుబ్బాక, హుజూరాబాద్, బల్దియా ఫలితాలు వల్లింపు. ఈ ఫలితాలన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యధాతథంగా పునరావృతమవుతాయా?
ఇలా బీజేపీ పరాజయపర్వం చెప్పుకొంటూపోతే ఒక ఉద్గ్రంథమే అవుతుంది. ఇక్కడ గ్రేటర్ ఫలితాలు వెల్లడవుతున్న తరుణంలోనే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ పరాజయం మూటగట్టుకుంది. వారి సైద్ధాంతిక రాజధాని నాగపూర్లో, మోదీ నియోజకవర్గం వారణాసిలో బీజేపీ ఓడిపోయింది. బెంగాల్లో భంగపడింది. నిన్నగాక మొన్న కర్ణాటక శాసనమండలి ఎన్నికల్లో బోర్లాపడిన బీజేపీ ఛండిగఢ్ కార్పొరేషన్ను కోల్పోయింది. తెలంగాణలో ఇతర పార్టీల విజయాలతో బీజేపీ విజయాలను బేరీజు వేస్తే ఆ పార్టీ 6వ స్థానంలో ఉంటుంది. టీఆర్ఎస్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ రెండు పార్టీలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. గత అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయి ఒకే ఒక్క స్థానాన్ని నిలబెట్టుకొని, స్థానిక సంస్థల్లో బొక్కబోర్లా పడ్డ బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడతామనడం ఓ రాజకీయ వింత. బీజేపీ నేతల మాటలు వింటుంటే ఉట్టికెగరలేనివాడు స్వర్గానికెగురుతాడన్న సామెత గుర్తుకొస్తుంది.
డాక్టర్ అయాచితం శ్రీధర్
96669 51258