ప్రజాస్వామ్య రథాన్ని కరోనా అడ్డుకోలేదు అన్నట్లుగా ఎన్నికల సంఘం (ఈసీ) ముందుకే వెళ్లటానికి నిర్ణయించింది. కొవిడ్ థర్డ్వేవ్ నేపథ్యంలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా? అన్న సందేహాలకు తెరదించింది. దేశంలో కరోనా అలజడి ప్రారంభమైన తర్వాత కూడా నిర్దేశిత గడువులోపే ఎన్నికలను ఈసీ నిర్వహిస్తున్నది. 2020 నవంబరులో బీహార్కుగానీ, ఆ మరుసటి ఏడాది మార్చి-ఏప్రిల్లలో బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలకుగానీ ఆయా అసెంబ్లీల గడువు పూర్తికాక ముందే ఎన్నికలు జరిగాయి. వీటివల్ల కరోనా ఉద్ధృతి పెరిగిందన్న ఆరోపణలు రాకపోలేదు. అయినా ఈసీ నిర్ణయం మారలేదు. దీనికి రాజకీయపార్టీల వైఖరీ ఓ కారణమే. ప్రస్తుత ఐదు రాష్ర్టాల ఎన్నికలను వాయిదా వేయవద్దని అవి ఈసీకి ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేశాయి. దీనికి ఆమోదిస్తూనే, ప్రత్యక్ష ప్రచారంపై ఈసీ తాత్కాలిక నిషేధం విధించటం ఊరటనిచ్చే నిర్ణయం.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నప్పటికీ అందరి దృష్టీ యూపీపైనే కేంద్రీకృతమైంది. 80 లోక్సభ సీట్లున్న యూపీని హస్తినకు దగ్గరి దారిగా పార్టీలు భావిస్తుంటాయి. అటువంటి యూపీలో ఎప్పుడూ బహుముఖ పోటీ నెలకొని ఉండేది. ఈసారి బీఎస్పీ ఎవరికీ అంతుబట్టని విధంగా నిష్క్రియగా మారిపోవటంతో, పోరు యావత్తు అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎస్పీ మధ్య కేంద్రీకృతమైంది. బీఎస్పీ ఓటుబ్యాంకు గంపగుత్తగా ఎస్పీకే బదిలీ అవుతుందా? కాంగ్రెస్ కొంత చీల్చుకుంటుందా? అన్నది ఆసక్తి కలిగిస్తున్నది. ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్ చురుకుగానే కదులుతున్నప్పటికీ.. అది బీజేపీకే దెబ్బ కావచ్చు. 1985 నుంచీ ఏ పార్టీ కూడా యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు.
ద్విముఖ పోరుకు పేరుగాంచిన పంజాబ్లో ఈసారి బహుముఖ పోటీ నెలకొనటం విచిత్రం. అధికారంలో ఉన్న కాంగ్రెస్, విపక్షాలైన అకాలీదళ్, బీజేపీ, ఆప్తోపాటు రైతుసంఘాలు కూడా బరిలో ఉన్నాయి. రైతుల సుదీర్ఘ ఉద్యమం.. అకాలీ-బీజేపీ స్నేహబంధాన్ని తుంచివేసింది. దీంతో అవి విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అంతర్గత సంక్షోభంతో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నది. మాజీ సీఎం అమరీందర్సింగ్ కొత్తపార్టీ పెట్టి బీజేపీతో చేతులు కలిపారు. ఢిల్లీ బయట విస్తరణ కోసం ఆప్ పంజాబ్లో గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. దీంట్లో ఎవరు గట్టెక్కుతారో చెప్పటం కష్టమే. ఉత్తరాఖండ్, మణిపూర్లలో అధికారంలో ఉన్న బీజేపీ వర్గపోరుతో సతమతమవుతున్నది. గోవాలో విస్తరణకు ఆప్, తృణమూల్ చేస్తున్న ప్రయత్నాలు అధికార బీజేపీకి కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. 2024 లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు.. మోదీ సర్కార్ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశం ఉంది. విపక్ష కూటమికి నాయకత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్లో ఇంకా మిగిలి ఉందా అన్నది కూడా దీంతో తేలిపోవచ్చు.