ముఖ్యమంత్రి కేసీఆర్కు కౌంటర్ ఇవ్వడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇటీవల మీడియా సమావేశంలో ఆయన అమెరికా అధ్యక్షుడి ఎన్నికల ప్రచారానికి మోదీ వెళ్లడం మొదలుకొని ఆహారధాన్యాలపై సబ్సిడీలకు కోత విధించడం వరకు ప్రస్తావించారు. ఆ సమావేశంలో మోదీ సర్కార్ను సాగనంపేదాకా విశ్రమించేదిలేదని హెచ్చరిక కూడా చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డిని మీడియా స్పందన కోరింది. కిషన్రెడ్డి ప్రిపేరై వచ్చాక మాట్లాడుతానని దాటవేశారు. గతంలో కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్రెడ్డి కూడా శాసనసభా సమావేశాల్లో తాను ప్రిపేరై రాలేదని చెప్పి నవ్వుల పాలయ్యారు. కేసీఆర్కు కౌంటర్ ఇవ్వాలంటే ఉత్తమ్కుమార్రెడ్డి, కిషన్రెడ్డిలే కాదు, ఏ నాయకుడైనా ప్రిపేరై రావాల్సిందే.
మమకారం?
మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ర్టాలు సైబర్ మోసగాళ్లకు అడ్డాలన్న విషయం తెలిసిందే. అన్ని నేరాలు తామే చేస్తే ఇతర రాష్ర్టాల నేరగాళ్లు ఎలా బతుకుతారనుకున్నారేమో! అందుకే క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్లతో జరిగే మోసాలను గుజరాత్ నేరగాళ్లకు వదిలిపెట్టినట్టున్నారు. ఇటీవల వెలుగుచూస్తున్న బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీ మోసాలు ఎక్కువగా గుజరాత్లోనే నమోదవుతున్నట్టు సైబర్క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. తన సొంత రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బలపడుతున్న క్రిప్టో కరెన్సీ మోసగాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందనే పార్లమెంట్లో చట్టం చేయకుండానే క్రిప్టో కరెన్సీపై జరిగే లావాదేవీలపై ప్రధాని మోదీ పన్ను విధించారేమోనన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఛలో ఢిల్లీ..!
చీర కొంటే జాకెట్, ప్యాంట్ కొంటే షర్ట్ ఉచితం వంటి ఆఫర్ల గురించి విన్నాం. కానీ, ఫుల్బాటిల్ మద్యం కొంటే రెండు ఫుల్బాటిళ్లు, క్వార్టర్ కొంటే ఆఫ్, ఆఫ్ కొంటే ఫుల్బాటిల్ ఉచితం గురించి మాత్రం ఇప్పుడే వింటున్నాం. ఈ బంపర్ ఆఫర్ను ఢిల్లీ ప్రభుత్వం కల్పించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మద్యం షాపులకు లైసెన్స్లను రెన్యూవల్ చేయాలంటే ఓల్డ్స్టాక్ను పూర్తిగా అమ్మేయాలనే నిబంధనను కేజ్రీవాల్ ప్రభుత్వం విధించింది. దీంతో పాతస్టాక్ అమ్ముకోవడానికి మద్యం షాపుల వ్యాపారులు ఈ బంపర్ ఆఫర్లు ప్రకటించారు. ఏపీలో మద్యం రేట్లు అధికంగా ఉన్నప్పుడు మందుప్రియులు తెలంగాణ, యానాం సరిహద్దున ఉన్న షాపులకు వెళ్లి మద్యం కొనేవారు. మందుబాబులు ఇప్పుడు ఏకంగా ఛలో ఢిల్లీ అంటున్నారు. వారికోసం టాక్సీ ఆపరేటర్లు కూడా ఒక ట్రిప్ బుక్ చేసుకుంటే రెండు ట్రిప్లు ఫ్రీ అంటూ ఇంకో బంపర్ ఆఫర్ పెట్టారట. ఇలా డబుల్ ఆఫర్లు వచ్చి పడుతుండటంతో మద్యం ప్రియులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై విపరీతమైన క్రేజ్ పెరిగింది.
– వెల్జాల