హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలకు) రుణాలు అందిస్తూ మహిళల ఆర్థికాభ్యున్నతికి దోహదపడుతున్న స్త్రీనిధి సంస్థ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎస్హెచ్జీలకే కాకుండా వాటిలోని సభ్యులకు సైతం తక్కువ వడ్డీతో రుణాలందిస్తున్న ఈ సంస్థ.. మహిళలకు అండగా నిలవడంలో బ్యాంకుల కంటే ముందున్నది. తెలంగాణలో స్త్రీనిధి కార్యకలాపాలు విజయవంతం కావడంతో ఇలాంటి సంస్థలను ఇతర రాష్ర్టాల్లో కూడా ఏర్పాటు చేయాలని నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) అధికారులు సూచించారు. దీంతో కర్ణాటక, ఒడిశా, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర అనేక రాష్ర్టాల ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చి స్త్రీనిధి పనితీరు, విధానాలపై అధ్యయనం చేశారు.
దశాబ్ద చరిత్ర
పేదరిక నిర్మూలనలో భాగంగా దేశంలోనే తొలిసారి సహకార సమాఖ్య తరహాలో 2011 అక్టోబరు 6న స్త్రీనిధి ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ సంస్థ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో మరింత జోరుగా ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వాటాదారులుగా ఈ పరపతి సమాఖ్య మైక్రో ఫైనాన్స్ తరహాలో సేవలందిస్తున్నది. దీనిని స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964 ప్రకారం రిజిస్టర్ చేసి, 24 మంది మహిళా సంఘాల ప్రతినిధులతో మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
స్త్రీనిధి ప్రత్యేకతలు ఎస్హెచ్జీలకు కేవలం 11 శాతం వడ్డీకే రుణాలు.
ఎలక్ట్రిక్ ఆటో, ద్విచక్ర వాహనాలు, ట్రాలీ, ల్యాప్టాప్ కొనుగోలు, పాడి బర్రెల పెంపకం, కోడి పిల్లల కేంద్రాలు, పెరటి కోళ్ల పెంపకం, వీధి వ్యాపారాలు, జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు తదితర అవసరాల నిమిత్తం ఒక్కో ఎస్హెచ్జీకి రూ.3 లక్షల వరకు రుణాలు.
ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కేవలం 48 గంటల వ్యవధిలోనే రుణాల మంజూరు.
వీటిపై బ్యాంకులు, ఇతర మైక్రోఫైనాన్స్ సంస్థల మాదిరిగా స్త్రీనిధి సంస్థ ఎలాంటి ఫీజులనూ, రహస్య (హిడెన్) చార్జీలనూ వసూలు చేయదు.
ఎస్హెచ్జీల నుంచి వసూలుచేసే వడ్డీలో 1.25 శాతాన్ని గ్రామ, మండల సమాఖ్యలకు బదలాయింపు.
నిర్వహణ ఖర్చుల నిమిత్తం మరో 0.15 శాతం వడ్డీని మండల సమాఖ్య, టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్)లకు జమ.
ఇలా గత ఎనిమిదేండ్లలో మొత్తం రూ.214 కోట్లు బదలాయింపు.
బీమా పథకం
పేదలకు సహాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న స్త్రీనిధి సంస్థ.. ఎస్హెచ్జీ సభ్యులకు సాధారణ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నది. ఎస్హెచ్జీ సభ్యులు ఏ కారణంతో మరణించినా లక్ష రూపాయల చొప్పున సాయం లభించేలా చూస్తున్నది. స్త్రీనిధి సురక్ష (బీ) పథకం పేరుతో దీన్ని అమలు చేస్తున్నది. 18 నుంచి 60 ఏండ్ల వయసున్న ఎస్హెచ్జీ సభ్యులు ఇందులో చేరేందుకు అర్హులు. ఇందుకోసం ఏటా రూ.230 చొప్పున మూడేండ్లకు కలిపి ఒకేసారి రూ.690 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా స్త్రీనిధి సంస్థే రుణంగా అందిస్తుంది.
సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే..
మహిళల ఆర్థిక స్వావలంబనలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నది. సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాం. దేశంలో మరెక్కడా మహిళలకు ఇంత భారీగా రుణాలివ్వడం లేదు. తెలంగాణలోని మహిళా సంఘాల పనితీరును కేంద్ర ప్రభుత్వమే అనేక సార్లు ప్రశంసించింది. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. మున్ముందు ఎస్హెచ్జీలకు ఇంకా పెద్ద మొత్తంలో రుణాలు అందిస్తాం.
– ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి
ప్రభుత్వానికి డివిడెండ్
లాభాల్లో నడుస్తున్న స్త్రీనిధి సంస్థ ప్రతి సంవత్సరం డివిడెండ్ను ప్రకటిస్తున్నది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ డివిడెండ్ను ఏటా 1 శాతం పెంచుతున్నది. ఇలా ఇప్పటివరకు ప్రభుత్వానికి మొత్తం రూ.39 కోట్ల డివిడెండ్ చెల్లించింది.