హుజూరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్యాస్ సిలిండర్పై రాష్ట్ర పన్ను విషయంలో మంత్రి హరీశ్ రావు విసిరిన సవాల్ను స్వీకరించే ధైర్యం చేయలేక మొహం చాటేసిన ఈటల రాజేందర్కు ఎట్టకేలకు జ్ఞానోదయమైంది. సిలిండర్పై రాష్ట్రం విధించే పన్ను రూ.22 మాత్రమేనని ఒప్పుకున్నారు. తాను చెప్పినట్టు సిలిండర్పై రాష్ట్ర పన్ను రూ.291 కాదన్నారు. గ్యాస్ సిలిండర్పై రాష్ట్ర ప్రభుత్వం రూ.291 పన్ను విధిస్తున్నదని ఈ నెల 12న హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. దీనిపై ఈటలకు మంత్రి హరీశ్ సవాల్ విసిరారు. రాష్ట్ర పన్ను రూ.291 అని నిరూపిస్తారా? అని చాలెంజ్ చేశారు. ఆ చాలెంజ్పై ఈటల మరోమాట మాట్లాడలేదు. కానీ, ఈ నెల 19న ప్రచారంలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్పై రూ.22 పన్ను విధిస్తున్నది అని వ్యాఖ్యానించారు. ఇది విని అక్కడున్న జనం ముక్కున వేలేసుకున్నారు. మొన్ననే కదయ్యా! రూ.291 అంటివి అని గుసగుస పెట్టుకున్నారు. ఓట్లు అడిగి గెలవాలని కానీ, ఈ అబద్ధపు మాటలు చెప్పుడేందివయ్యా! అని అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అసలు రాష్ట్రం విధించే పన్ను ఎంతంటే..
సిలిండర్పై రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించింది. కేంద్ర విధానం ప్రకారం సిలిండర్పై మన రాష్ట్ర ప్రభుత్వ వాటా 2.5 శాతం. అంటే.. రూ.22 మాత్రమే. కేంద్రం వసూలు చేసే పన్ను ఒక్కో సిలిండర్పై రూ.653. 2014-2018 మధ్య ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్కు తెలుసు. కేంద్ర, రాష్ట్ర పన్నుల అంశం ఆర్థిక శాఖ పరిధిలోనే ఉంటాయి.
ఇక్కడా బెంగాల్ ఫలితమే
బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా హుజూరాబాద్లో పశ్చిమబెంగాల్ ఫలితమే పునరావృతంఅవుతుంది. ఇప్పుడు దేశమంతా హుజూరాబాద్ వైపు చూస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు సమస్యను అధిగమించింది. కోతలు లేకుండా ప్రతీరోజు దీపావళిలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. మంత్రి కేటీఆర్ ప్రపంచసంస్థలను హైదరాబాద్కు తీసుకొస్తూ ఉపాధి పెంచుతున్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే కేంద్ర మంత్రులు తెలంగాణను ప్రశంసిస్తున్నారు.
-రేఖ, రాజకీయ విశ్లేషకురాలు