వరంగల్ : హన్మకొండ కాళోజీ సర్కిల్లో ఓ డ్రైవర్ తన ఆటోను తగులబెట్టాడు. పెట్రోల్ పోసి నిప్పంటించగా.. ఆటో కాలిపోయింది. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో జీవనోపాధి కోల్పోయానని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనాకు తోడు ధరల పెరుగుదలతో అప్పుల భారం పెరిగిపోయి ఆటో ఫైనాన్స్ చెల్లించలేక దానికి నిప్పంటించానని వాపోయాడు. లాక్డౌన్లో కొద్ది రోజులు ఆటోలు తిరగలేదని.. ప్రస్తుతం ఆటోల్లో తిరిగేవారు తక్కువయ్యారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో వాహనాన్ని కాల్చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. వాహనాల రద్దీతో ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఆటోకు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఏం జరుగుతోందో అర్థం వాహనదారులకు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.