ముషీరాబాద్, డిసెంబర్ 16: జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్, కేతవరపు ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ రచించిన మార్నింగ్ కాఫీ కథా సంపుటి ఆవిష్కరణ సభ గురువారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి.రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొని మార్నింగ్ కాఫీ సంపుటిని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాస్తవిక జీవిత ప్రస్థానానికి అద్దం పట్టినట్లుగా మార్నింగ్ కాఫీ కవితాసంపుటి రూపుదిద్దుకుందని అన్నారు. కథలో తెలుగు తనం రాసులు పోసినట్లుగా రచయిత్రి రాజ్యశ్రీ రచనలు ఉన్నాయని కొనియాడారు. రచయిత్రి డాక్టర్ ముక్తేవి భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, నేటి నిజం సంపాదకులు బైస దేవదాసు, రచయిత పెద్దూరి వెంకటదాసు, డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ, జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ గుదిబండి వెంకటరెడ్డి, కేతవరపు ఫౌండేషన్ అధ్యక్షుడు కె.మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చిల్లా శివపార్వతి శిష్య బృందం నిర్వహించిన లలిత సంగీత విభావరి, సాయి అరుణాంజలి కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.