బంజారాహిల్స్, జనవరి 24: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇంటింటికీ వెళ్లి జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలు గుర్తించేందుకు ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివిజన్లలో 55 బృందాలు ఫీవర్ సర్వేను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. తమకు కేటాయించిన బస్తీలు, కాలనీల్లోని అన్ని ఇండ్లకు వెళ్లి జ్వరం తదితర లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారు. వారికి మెడిసిన్ కిట్ అందజేస్తున్నారు.
ప్రతి ఇంట్లో కచ్చితంగా ఒకరు లేదా ఇద్దరు జ్వర లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వేలో గుర్తిస్తున్నారు. మొత్తం జనాభాలో సుమారు 70శాతం మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నారని సర్వేలో వెల్లడవుతున్నది. కరోనా లక్షణాలు కనిపించిన వారందరూ ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవడంతో పాటు హోమ్ ఐపొలేషన్లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల వేరే వాళ్లకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
తగ్గుతున్న కొవిడ్ కేసులు
ఖైరతాబాద్ నియోజకవర్గంలో కొవిడ్ కేసుల శాతం అదుపులోనే ఉంది. వారంరోజుల పాటు భారీగా పెరిగిన కొవిడ్ కేసులు మూడు రోజులుగా తగ్గుతున్నాయి. సోమవారం నియోజకవర్గంలోని ఆరు కేంద్రాల్లో మొత్తం 824 మందికి పరీక్షలు చేయగా వారిలో 116 మందికి పాజిటివ్గా తేలింది. పరీక్షలు చేయించుకున్న వారిలో పాజిటివిటీ రేటు 13.8 శాతంగా నమోదైంది. కరోనా హాట్స్పాట్గా మారిన బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని షౌకత్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో సోమవారం 167 మందికి పరీక్షలు చేయగా వారిలో 27 మందికి పాజిటివ్గా తేలింది.
ఇక్కడ పాజిటివిటీ రేటు 16శాతంగా నమోదైంది. నాలుగురోజుల క్రితం ఇక్కడ పాజిటివిటీ రేటు సుమారు 28 శాతం కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. చింతల్ బస్తీ ఆరోగ్య కేంద్రంలో 161మందికి పరీక్షలు చేయగా వారిలో 21మందికి, బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో 179మందిలో 14 మందికి, జూబ్లీహిల్స్ పీహెచ్సీలో 141మందిలో 28మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇదే కొనసాగితే మరో పదిహేను రోజుల్లో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.